Harish Rao | ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనపై దృష్టి సారించాలని.. రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులను గాలికి వదిలేసి.. అందాల పోటీలు నిర్వహిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గన్నీ బ్యాగులను సమకూర్చడంలో ప్రభుత్వం వైఫలయ్యం చెందిందన్నారు. ధాన్యాన్ని లారీలకు ఎక్కించే హమాలీలను సమకూర్చడంలో విఫలమైందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో, గొప్పగా చెప్పిన బోనస్ అందజేయడంలో ఘోర వైఫల్యమంటూ ధ్వజమెతన్నారు. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగు తీమయని చెప్పారని.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జెట్టి రాజు అనే రైతు క్వింటాల్కు పది కిలోలు తరుగు తీస్తున్నారని ఆత్మహత్య చేసుకున్నాన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో రైతులు ఆందోళన చేపట్టారన్నారు. తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకం కంటే మిల్లర్లు తక్కువ ధాన్యాన్ని చూపుతూ రైతులకు నష్టం కలిగిస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడానికి 3-4 రోజులు, మిల్లుల దగ్గర అన్లోడ్ చేయడానికి మరిన్ని రోజులు ఆలస్యం జరుగుతందని.. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేనద వ్యక్తం చేశారు. ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు 10-10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడాల్సిన దుస్థితి ఎదురైందని.. ఈ ప్రభుత్వం మాటలు ఘనం చేతలు శూన్యం అంటూ విమర్శలు గుర్పించారు.
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో వేచి చూడడం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. మే 13న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో గగులోతు కిషన్ మృతి చెందారని, 15న జగిత్యాల జిల్లా కథలాపూర్లో జలపతి రెడ్డి చనిపోయారని తెలిపారు. ఏప్రిల్ 21న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు చెర్లపాలెంలో హనుమండ్ల ప్రేమలత మృతి, ఏప్రిల్ 22న నెల్లికుదురు మండలం మదనతుర్తిలో బిర్రు వెంకన్న, 26న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో చింతకింది హనుమయ్య మృతి చెందారన్నారు.
ధాన్యపు రాశులే సాక్షంగా.. కొనుగోలు కేంద్రాల్లోనే జరుగుతున్న ఈ రైతు మరణాలు ప్రభుత్వపు హత్యలేనన్నారు. ఇవి సహజ మరణాలు కావు, ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవే హత్యలేనని ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అందాల పోటీల మీద పోలీస్ కమాండ్ కంట్రోల్, జూబ్లీహిల్స్ ప్యాలస్లో రివ్యూలు పెడుతున్నారని.. సెక్రటేరియట్ ముఖం కూడా ముఖ్యమంత్రి చూడడం లేదని విమర్శించారు. రైతు సమస్యలపై ఎందుకు ముఖ్యమంత్రి రివ్యూ పెట్టడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో చెప్పినట్టు రూ.42వేలకోట్ల రుణమాఫీ జరిగిందా? లేదా? అని రివ్యూ చేయడానికి ముఖ్యమంత్రికి సమయం లేదని.. రాష్ట్రంలో రైతు బీమా కట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు బీమా అందించామన్నారు.
ఫిబ్రవరి నెలలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం కట్టకపోవడం వల్ల చనిపోయిన రైతులకు రైతు బీమా అందడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వివిధ జిల్లాల్లో ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలులో అకాల వర్షానికి తడవడంతో రైతులు రాస్తారోకో చేశారని.. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారని హరీశ్రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామంలో సన్న వడ్ల కొనుగోలు లేకపోవడంతో రైతులు సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై ధర్నా చేశారని చెప్పారు. వనపర్తి పట్టణంలోని చిట్యాల మార్కెట్ యార్డు వద్ద వర్షాలకు వేలాది బస్తాల వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిందని.. కాంటా జాప్యం, తరలింపు ఆలస్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎర్వ చింతల్లో తూకంలో మోసాలపై పీఏసీఎస్ నిర్వాహకులను రైతులు ఘోరావ్ చేసి తక్షణ చర్యలకు డిమాండ్ చేశారని తెలిపారు.
రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే ఎందుకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని.. ప్యాలెస్లో అందాల పోటీలపై రివ్యూలా..ఝ మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినా రైతులకు ఏమో మోసమా మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా? అంటూ నిలదీశారు. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలకు రాహుల్ గాంధీ సాక్ష్యమన్నారు. రాహుల్ గాంధీ వరంగల్లో రైతులకు ఇచ్చిన హామీలపై ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ముఖ్యమంత్రి అడిగితే ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారని.. ఎవ్వడు నమ్మి అప్పు ఇవ్వట్లేదు అంటున్నారన్నారు. చివరికి పాకిస్తాన్ని నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదన్నారు.
ప్రతిపక్షం మీద బురదజల్లబోయి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వేపడ్డావు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి, రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలని.. సీఎం అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదని.. తరుగు, తాలు పేరు మీద ఐదు నుండి పది కిలోలు తరుగు తీస్తున్నారు కాబట్టి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు.