సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ(BRS party) సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్(Insurance) సదుపాయం పార్టీ కల్పించిందని.. ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తెలిపారు. ప్రతి కార్యకర్తలకు అండగా నిలుస్తున్నామని.. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 48 మందికి రూ.2 లక్షల చొప్పున రూ.96 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తూ చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన సుంచనకోట యాదగిరి ఇటీవల ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయాడు. వారి కుటుంబానికి మంజూరు అయిన రూ.2 లక్షల చెక్ను యాదగిరి భార్య మాధవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమేష్గౌడ్, ఎంపీటీసీ సునీతా మహేందర్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉల్లి మల్లయ్య, యువజన నాయకుడు ఆకుబత్తిని రాము పాల్గొన్నారు.