కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలవుతాయని సీఎం రేవంత్ అంటున్నరు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. ఇక్కడ హామీలు అమలయ్యేది లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.
-హరీశ్రావు
రంగారెడ్డి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమం చేయని వ్యక్తి, ఏనాడూ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణపై గులాబీ జెండాకు ఉన్న ప్రేమ కాంగ్రెస్కు, బీజేపీకి ఉండదని, వారి రాజకీయాలు ఓ గేమ్లా ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తున్నదని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలవుతాయని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని, కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, ఇక్కడ హామీలు అమలయ్యేది లేదని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. హామీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
మోదీ ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా?
ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్నగర్కు వచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ఏమైందని హరీశ్రావు ప్రశ్నించారు. పదేండ్ల మోదీ పాలనలో ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? అని బీజేపీ నేతలను నిలదీశారు. జాతీయ ప్రాజెక్టులు తెస్తామని చెప్పి ఢిల్లీకి పోయిన కాంగ్రెసోళ్లు చేతులు ముడుచుకుని వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి జాతీయ ప్రాజెక్టును తేవడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. కల్వకుర్తి పంప్హౌజ్ వద్ద అహోరాత్రులు ఉండి పనులు పూర్తి చేయించామని, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలో 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేటలో మెడికల్ కాలేజీలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని చెప్పారు.
కాంగ్రెస్కు ఓటేస్తే ఉపయోగం లేదు
కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేని కాంగ్రెస్కు ఓటువేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని హరీశ్రావు అన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆరు లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది బీఆర్ఎస్ ఎంపీలేనని స్పష్టంచేశారు.
లోక్సభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాలి
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషిచేయాలని హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో చర్చ మొదలైందని, రానున్న రోజుల్లో ప్రజలే బీఆర్ఎస్ను వరుసబెట్టి గెలిపిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్నగర్ అని, ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో షాద్నగర్ ప్రజలు ఉద్యమంలో స్ఫూర్తి నింపారని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్నగర్లో గులాబీ జెండా ఎగురవేయాల్సిందేనని, అందుకు కార్యకర్తలు అందరూ సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చా రు. కార్యకర్తలు ఒక్క ఫోన్ చేస్తే 39 మంది ఎమ్మెల్యేలం బస్సు వేసుకుని వస్తామని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంతగా దేశంలో మరే ప్రభుత్వం చేయలేదని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇప్పుడు నీళ్లొస్తయో లేవో తెల్వదు.. సుస్తయితే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తదో రాదో! తెల్వని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈ పరిస్థితి వస్తదని తెలిస్తే ప్రజలు బీఆర్ఎస్కే పట్టం గట్టేవారని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మా జీ ఎమ్మెల్యేలు వై అంజయ్యయాదవ్, సీ లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రాంమోహన్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేష్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అడ్డుకోకపోతే నోట్ల మట్టి పడుతుండె
కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తామని సంతకాలు చేసి వచ్చారని హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారులో ఏనాడూ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పగించలేదని తెలిపారు. కేసీఆర్ నల్లగొండలో గర్జించాక.. అసెంబ్లీలో నిలదీయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అడ్డుకోకపోతే తెలంగాణ నోట్లో మట్టి పడేదని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్లో 27,300 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6.36 లక్షల ఎకరాలకు సాగు నీరందించామని తెలిపారు.