సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, ఉద్యమకారులపై తుపాకీ ఎకు పెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. ఎమ్మెల్యేల కొనుగోలులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్. ఎన్టీఆర్ జన్మపర్యంతం ద్వేషించిన కాంగ్రెస్లో చేరి, నమ్మినపార్టీకి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ.. బీజేపీతో చీకటి స్నేహం కొనసాగిస్తున్న రాజకీయ ద్రోహి రేవంత్రెడ్డి.
– మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ద్రోహ బుద్ధి అనేది రేవంత్రెడ్డి డీఎన్ఏలోనే ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు, రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని ధ్వజమెత్తారు. ముమ్మాటికీ రేవంత్రెడ్డిది ద్రోహ చరిత్రేనని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆదివారం ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కంచే.. చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి అయి ఉండీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్రెడ్డి అని, అవినీతి దాహం, ప్రజాద్రోహం కలిసి రేవంత్ అని తూర్పారబట్టారు.
‘ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం అంటే అది రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడం కాదా? ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా?’ అని హరీశ్ ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసుల బాధ్యత ఎటు పోయింది? అని నిలదీశారు. ‘సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రతలను కాపాడే హోంశాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు? చట్టం అందరికీ ఒకటేనని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకు ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
రాజకీయంగా ఎదురోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తామని, ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే గుణపాఠం నేర్పుతామని తేల్చిచెప్పారు. ‘హింసను ప్రేరేపించేలా సీఎం చేసిన వ్యాఖ్యలపై మీరు తీసుకొనే చర్యలేమిటి? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతున్నదా? లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నదా?’ అని డీజీపీని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సరార్ను వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్రెడ్డి మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబేంటి? అని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉన్నదని విమర్శించారు. పగలు రాహుల్గాంధీ జపం చేసే రేవంత్రెడ్డి.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతున్నదని మండిపడ్డారు. సోనియాగాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు.