మేడ్చల్, సంగారెడ్డి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ), గజ్వేల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒకమాట మాట్లాడుతున్న కేంద్ర మంత్రులది నోరా.. మోరీనా అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నదన్నారు. దేశాన్నే అబ్బుర పరిచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరుగలేదని పార్లమెంట్లో విస్పష్టంగా ప్రకటించిన కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. మంగళవారం బీబీ నగర్ వచ్చి.. కాళేశ్వరానికి ఎలాంటి అనుమతులు లేవని, ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
బుధవారం మెదక్, మేడ్చల్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్రావు.. కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు 2017 నవంబర్లో అనుమతి ఇచ్చిన వారే.. తెలంగాణకు వచ్చి అనుమతి లేదని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే రాష్ర్టానికి వచ్చిన మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు అని.. గ్రోత్ ఇంజిన్ ఆఫ్ తెలంగాణ అని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ర్టానికి లైఫ్లైన్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. 90 అడుగులు లోతులో ఉన్న నీటిని 600 అడుగుల ఎత్తు వరకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులకు సంబంధించిన జీవోలను మంత్రి హరీశ్రావు చదివి వినిపించారు.
బీబీ నగర్లో ఎయిమ్స్ పరువును తీసి దిగజార్చింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎయిమ్స్లో బడ్ల్ బ్యాంక్ లేదు, ఆపరేషన్ థియేటర్ లేదని పేర్కొన్నారు. ఎయిమ్స్లో చదివే విద్యార్థులు ఉస్మానియా, గాంధీలో జాయిన్చేసుకోవాలని అడుగుతున్నారని మంత్రి చెప్పారు. ఎయిమ్స్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. ఎయిమ్స్ పక్కనే ఉన్న భువనగిరి జిల్లా దవాఖానలో 1,083, రామన్నపేట ఏరియా దవాఖానలో 245, ఆ పక్కనే ఉన్న సీఏసీ చౌటుప్పల్లో 214, బీబీనగర్ అర్బన్ పీఏసీలో 11 కాన్పులు అయినాయని.. ఎయిమ్స్లో మాత్రం నాలుగేండ్లలో ఒక్క కాన్పు కూడా జరుగలేదని ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్ దవాఖానకు 201 ఎకరాలు, 210 పడకల దవాఖాన ఇచ్చి నాలుగేండ్లు అయినప్పటికీ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 61 శాతానికి ప్రసవాలు పెరిగాయని.. ఇది కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కిషన్రెడ్డి ఏరోజూ ఎయిమ్స్ను పట్టించుకొన్న పాపాన పోలేదని మండిపడ్డారు.
ఉస్మానియా దవాఖానలో రౌండ్ ది క్లాక్ వైద్య సేవలు అందుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలుసుకోవాలని మంత్రి హరీశ్రావు హితవు చెప్పారు. ప్రతిరోజూ దాదాపు 1,900 ఇన్పేషెంట్లు, 6,200 మంది అవుట్ పేషెంట్లు దవాఖానలో వైద్యం పొందుతున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా వైద్యులు గుండె, మోకాళ్లకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారని, ఎలాంటి పేదవారికైనా నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని వివరించారు. అలాంటి ఉస్మానియా వైద్యులను కించపరిచేలా కిషన్రెడ్డి మాట్లాడటం సబబేనా? అని ప్రశ్నించారు. వైద్యుల మనోభావాలను దెబ్బతీయవద్దని సూచించారు. దేశంలో 157 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇచ్చిన కేంద్రం చేత తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు మంజూరు చేయించలేకపోయారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు.
పేదలకు ఇస్తున్న ఉచిత పథకాలు వద్దంటున్న ప్రధాని మోదీ.. బడా బడా కంపెనీలకు మాత్రం రూ.12 లక్షల కోట్లను మాఫీ చేశారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రూ.5 లక్షల ఉచిత బీమా, రూ.10 వేల రైతుబంధు, రూ.2 వేల ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కాన్పుకు రూ.12 వేల నగదు, కేసీఆర్ కిట్లు ఇవ్వొద్దా? అని ప్రశ్నించారు. పేదల కోసం ఎవరు పనిచేస్తున్నారు. బడా బడా కంపెనీలకు ఎవరు పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత పథకాలు బంద్ చేయడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పారు. ఉచితాలు వద్దన్న బీజేపీని గ్రామాల్లోకి రాకుండా ఊరవతల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పనిలోనూ రెండుసార్లు ఫొటో దిగితే గానీ డబ్బులివ్వబోమంటూ కేంద్రం పేచీ పెడుతున్నదని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ చొరవతో కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో 28 రాష్ట్రాలకు చెందిన కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు మరింత మెరుగైన వైద్య కోసం ఈఎస్ఐ దవాఖానలను పటిష్ఠం చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఉత్తమ కార్మిక సంక్షేమ పాలసీని తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు.
ధరణి అంటే రాజముద్ర అని, మోసాలకు తావులేకుండా భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు లక్షమందికి పైగా ధరణి పోర్టల్ను వినియోగించుకొన్నారని తెలిపారు. ధరణి ప్రవేశపెట్టక ముందు జరిగిన తప్పిదాలతో కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ములుగులో నెల క్రితం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడ 118 మంది రైతుల నుంచి దరఖాస్తులు రాగా, 101మంది రెవెన్యూ సమస్యలను పరిష్కరించి బుధవారం రైతులకు పాసుపుస్తకాలు, టైటిల్డీడ్ పత్రాలను మంత్రి అందజేశారు.
పైలట్ ప్రోగ్రాం విజయవంతం కావడంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ ప్రోగాం చేపట్టాలని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు హరీశ్రావు తెలిపారు. త్వరలోనే 57 ఏండ్లు నిండిన వారందరికీ రూ.2,016 పింఛన్ లభిస్తుందని, 10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్కార్డులు అందిస్తామని వివరించారు. కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఈఎస్ఐ దవాఖానలను ఖర్చుకు వెనుకాడకుండా కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరిస్తున్నారని వెల్లడించారు. ఈఎస్ఐ దవాఖానల్లో త్వరలోనే 480 పోస్టులు భర్తీచేస్తామన్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. మంత్రి హరీశ్రావు వెంట మంత్రి మల్లారెడ్డి, ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఉన్నారు.