హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. దాడి విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభాకర్రెడ్డిని హైదరాబాద్ లోని యశోద దవాఖానకు తరలిస్తున్నారని తెలుసుకొని, హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్ రాగానే, దవాఖానలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి వైద్యులను అప్రమత్తం చేశారు. దగ్గురుండి అన్ని పరీక్షలు చేయించారు. ప్రతి క్షణం వైద్యుల నుంచి ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభాకర్రెడ్డి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్.. ఉద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కొత్త ప్రభాకర్రెడ్డికి రక్తస్రావం తీవ్రంగా ఉన్నదని, గజ్వేల్ దవాఖాన డాక్టర్లు చెప్పడంతో వెంటనే హైదరాబాద్ యశోద దవాఖానకు తరలించామని వెల్లడించారు. డాక్టర్లు పరిశీలించి సీటీ స్కాన్ చేశారని, సర్జరీ చేయాలని ఆపరేషన్ థియేటర్కు మార్చారని వివరించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని చెప్పారు.
ప్రభాకర్రెడ్డి చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదని, పదేండ్లుగా ఎంపీగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. సౌమ్యంగా ఉండే వ్యక్తి అని, మృదుస్వభావి అని వెల్లడించారు. ఆయన మీద దాడిని ఉహించలేకపోతున్నామని, తట్టుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే ఫోనోలో మాట్లాడితే.. ‘చక్కెర వస్తుంది. కండ్లు తిరుగుతున్నాయి. నన్ను కాపాడండి’ అంటూ ఏడ్చారని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి కత్తి పోట్లు, ప్రత్యక్ష దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కొవాలి తప్ప, భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పారు. వేంకటేశ్వరస్వామి దయతో ప్రభాకర్రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభాకర్రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. యశోద దవాఖానలో ప్రభాకర్రెడ్డి ఆపరేషన్ నాలుగు గంటలపాటు సాగగా, ఆందోళనతో మంత్రి హరీశ్రావు ఆపరేషన్ థియేటర్ వద్దే నిలబడి ఉన్నారు.