సంగారెడ్డి : ప్రజాస్వామ్యంలో విజయాలు, పరాజయాలు.. పాలక పక్ష పాత్ర, ప్రతిపక్ష పాత్రలు ఉంటాయని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. గురువారం నారాయణ్ఖేడ్( Narayankhed) బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇటు నారాయణ్ ఖేడ్లో అటు రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాన్నికొద్ది తేడాతో మిస్ అయ్యామని చెప్పారు.
అధికారం శాశ్వతం కానట్టే ఓటమి కూడా శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రతి నిత్యం మదిలో ఉంచుకోవాలని సూచించారు. నారాయణ్ ఖేడ్లో కాంగ్రెస్ హయాంలో ఏం పనులు జరిగాయో పదేళ్ల బీఆర్ఎస్ శాసన సభ్యుడిగా ఉండి ఏ పనులు చేశారో మీరు చూశారు. నారాయణ్ ఖేడ్ ను నిజాయితీగా నిబద్ధతగా అభివృద్ధి చేశామన్నారు. నీళ్లు లేని చోట నీళ్లిచ్చాం. కరెంటు లేని చోటుకు కరెంటు ..రోడ్లు బాగు చేసుకున్నాం. ప్రజలకు మన కష్టం విలువ మున్ముందు తెలుస్తుందన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్కు ఓటేస్తే మోరీలో వేసినట్టే. బీఆర్ఎస్ గెలవాలె. తెలంగాణ నిలవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడు పాల్గొనని, జై తెలంగాణ అనని, అమరుల స్తూపం దగ్గర రెండు పువ్వులు కూడా పెట్టని రేవంత్కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ పాలనను, కాంగ్రెస్ మోసాలను దావత్లో, పెళ్లిలో, రచ్చబండలో అన్ని చోట్లా చర్చించండి. ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.