సిద్దిపేట : దుబ్బాక(Dubbaka)లో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. మంగళవారం దుబ్బాక బీఆర్ఎస్ కార్యకర్తల కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు.
గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. మీరు, ప్రజలు ఇప్పుడు ప్రభాకరన్నను 50 వేలకుపా మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహా చెల్లించి అద్భుత విజయాన్ని అందించారని ప్రశంసించారు. మంచి వ్యక్తి అయిన కొత్త ప్రభాకర్కు అందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కడుపులో పెట్టి కాపా డుకుంటాం. మనలో మనకు విభేదాలు వద్దు. మనం విడిపోతే వాళ్లు బాగుపడుతారని పేర్కొన్నారు. కలిసి వుంటే కలదు సుఖం.
దుబ్బాక అంటే గులాబీ పార్టీ అడ్డా. ఇది తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లుని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ దుబ్బాక కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో చేయాలి. ఈ అసెంబ్లీ ఎన్నికలు మనకు స్పీడ్ బ్రేకర్ వంటివి. బండి నెమ్మదిగా వెళ్లి మళ్లీ వేగం అందు కుంటుందని చెప్పారు. మనం నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని సూచించారు. తప్పులు జరిగి వుంటే దిద్దుకుని ప్రజలతో మమేకం కావాలి. మనం ముళ్లబాటలూ చూశాం, పూలబాటలూ చూశాం. ప్రజలు మన ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే తేడాను గుర్తించారన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు. మన ఏడు మండలాలను, సీలేర్ ప్రాజెక్టులను ఆంధ్రాకు కట్టబెట్టిన ఆ పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం కోసమే వాటి పాకులాట అని విమర్శించారు. మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో 13 పెద్ద హామీలు ఉన్నాయి. మొత్తం 412 హమీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చాలని మనం డిమాండ్ చేయాలి. మనకు పోరాటాలు కొత్తకాదు. అంతిమ విజయం మనదేనని హరీశ్ రావు పేర్కొన్నారు.