‘కల్యాణలక్ష్మి ఇవ్వలేదు. ఇస్తామన్న తులం బంగారం ఎగబెట్టారు. స్కూటీలు ఇస్తామని మాట తప్పారు. కాంగ్రెస్ వచ్చింది.. కేసీఆర్ కిట్ బంద్ అయ్యింది. కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. అన్నివర్గాల ప్రజలను రేవంత్రెడ్డి మోసం చేసిండు’
-హరీశ్రావు
Harish Rao | సిద్దిపేట, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్వన్నీ ఫేకులు, లీకులు.. ఝూటా మాటలు, ప్రచారాలే. సోషల్ మీడియా, టీవీల్లో, పేపర్లలో లీకువార్తలు రాయించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కాంగ్రెస్ మోసాలను యువత ఎక్కడికక్కడ ఎండగట్టాలి. గ్రామాల్లో ప్రజల మధ్య చర్చ పెట్టాలి. మోసపూరిత వాగ్దానాలు చేసే పార్టీల నాయకులకు బుద్ధి చెప్పాలి’ అని పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో మేర్గు మహేశ్ అధ్యక్షతన విద్యార్థి, యువత, సోషల్మీడియా వారియర్స్తో, నర్సాపూర్లో నిర్వహించిన సమావేశాల్లో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఐదేండ్లకు మించి పాలన సాగించిన రాష్ట్రం లేదని తెలిపారు. కొన్ని రాష్ర్టాల్లో మధ్యలోనే సెల్ఫ్గోల్ కొట్టుకొని అధికారం కోల్పోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనూ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని వెల్లడించారు. ‘బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. కానీ మనం అధికారంలో ఉన్నన్ని రోజులు అభివృద్ధి చేయాలన్న తపనతోనే ముందుకు సాగాం. ఒక్కటి మాత్రం పక్కా.. ఇటు ఉన్న సూర్యుడు అటు పొడుసుడు ఎంత నిజమో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం కూడా అంతే నిజం. భవిష్యత్తు మనదే. ఎవరూ అధైర్యపడొద్దు’ అని భరోసా కల్పించారు.
రేవంత్కు కర్రుకాల్చి వాత పెట్టాలి
జిల్లాలు రద్దు చేస్తానన్న రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీశ్ పిలుపునిచ్చారు. ‘నోటికి కాడి బుక్కను ఎత్తగొడతా అంటున్నావ్. మా జిల్లాను రద్దు చేస్తా అంటున్న నీకు ఎందుకు ఓటు వేయాలి’ అని రేవంత్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటను జిల్లాలుగా చేసి కేసీఆర్ అందరి ఆకాంక్షలను నెరవేర్చిండు. పరిపాలనను దగ్గరకు తెచ్చిండు. ఉన్న దాన్ని ఈ సీఎం రేవంత్రెడ్డి కరాబ్ చేస్తున్నడు. నీకు(రేవంత్) నీతి, నిజాయతీ ఉంటే ఇంకా మంచి పాలన చేయాలి’ హితవు చెప్పారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. రుణమాఫీ వచ్చినవాళ్లంతా కాంగ్రెస్కు, రానివాళ్లంతా బీఆర్ఎస్కు ఓటేయాలని అన్నారు. నర్సాపూర్కు కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు ఇచ్చారని, డిపో, మంజీరాపై చెక్డ్యాంలు నిర్మించారని తెలిపారు. ఇచ్చిన హామీలు.. ఇవ్వని హామీలనూ నెరవేర్చారని వెల్లడించారు. కాంగ్రెస్ తీరు మాత్రం ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటినంక ఓడ మల్లన్నలా ఉన్నదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలకు చరమగీతం పాడిందని ఫైర్ అయ్యారు. ‘కల్యాణలక్ష్మి ఇవ్వలేదు. ఇస్తామన్న తులం బంగారం ఎగబెట్టారు. స్కూటీలు ఇస్తామని మాట తప్పారు. కాంగ్రెస్ వచ్చింది.. కేసీఆర్ కిట్ బంద్ అయ్యింది. కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. అన్నివర్గాల ప్రజలను రేవంత్రెడ్డి మోసం చేసిండు’ అని చెప్పారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలని అన్నారు.
తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా?
‘బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? సిద్దిపేట జిల్లా కాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా? ఇయ్యాల ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉద్యమించిన నాడు మనమంతా, పోరాటాలు చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం వస్తది అంటే ఎవరు నమ్మలేదు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఎంతో మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాల మీద, కేసీఆర్ పోరాటం ఫలితంతో ఇయ్యాల స్వరాష్ట్రం సిద్ధించింది. రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడైన జై తెలంగాణ అన్నాడా?. మనం తెలంగాణ కోసం కోట్లాడితే సమైక్యవాద తెలుగుదేశంలో ఆంధ్రానాయకుల మడుగులు ఒత్తుతూ తెలంగాణ అంటే కాల్చేస్తా అని తుపాకీ పట్టుకొని మనమీదికి వచ్చిండు. రైఫిల్రెడ్డి.. రేవంత్ రెడ్డి. ఒక్కరోజైనా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు పోయి రెండు పువ్వులు కూడా పెట్టలేదు. అటువంటి వ్యక్తి ఇయ్యాల తెలంగాణకు సీఎం కావటం దురదృష్టకరం’ అని వెల్లడించారు.
వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి
దుబ్బాక ప్రజలను మోసం చేసినందుకు రఘునందర్రావును ప్రజలు మడతపెట్టి ఉతికారని హరీశ్ అన్నారు. మెదక్కు బీఆర్ఎస్ కంచుకోట అని, వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టితో గెలిపించాలని కోరారు. కలెక్టర్గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని, ఎంపీగానూ సేవా కార్యక్రమాలు చేస్తారని వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో, అక్కడే ఎంపీగా పోటీ చేసే అవకాశం రావటం అదృష్టమని అన్నారు. ‘మన పార్టీ కార్యకర్తలు చూపించిన వారికి నేను ఏర్పాటు చేసే ఫంక్షన్ హాళ్ల ద్వారా ఒక్క రూపాయికే సేవ అందిస్తా. పేదల పిల్లల కోసం వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నా. 50 ఏండ్ల పాటు నా సేవలు గుర్తు ఉండిపోయేలా చేస్తా. సేవాభావంతో ముందుకు వస్తున్న నన్ను భారీ మెజార్టీ గెలిపించాలి అని కోరారు.
పొద్దుతిరుగుడు పంటను మొత్తం కొనాలి
తెలంగాణలో పండించిన మొత్తం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దిగుబడి అయ్యే 1,65,800 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు పంటలో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందని, మిగతా పంటను ఎంఎస్పీతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా..
‘రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు (సన్ఫ్లవర్) పంట వేశారు. ఈ పంటకు మారెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని నేను ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశాను. స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మద్దతు ధర రూ.6,760 చెల్లించి పంటను కొంటామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే మారెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదు. దీంతో 75 శాతం పంటను రైతులు చాలా తకువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తున్నది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిగింజ వరకూ..
రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో 37,300 క్వింటాళ్లు (25శాతం) మాత్రమే కొనడానికి అంగీకరించింది. మిగతా 75 శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ రైతులు పండించిన చివరిగింజ వరకు మార్ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరే స్వయంగా జోక్యం చేసుకుని పొద్దు తిరుగుడు పువ్వు పంటను మొత్తం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి, రైతులు ఆదుకోవాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.