మెదక్/రామాయంపేట/నిజాంపేట, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణకు, ప్రజలకు రంది లేదని వ్యాఖ్యానించారు. నీళ్లతో గౌడన్నకు కల్లు ఫుల్లుగా దొరుకుతున్నదని, గొర్లు, మేకలు మంచిగ బతుకుతున్నయని, మత్స్యసంపద పెరుగుతున్నదని వెల్లడించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ఆదివారం మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువలో పూలు చల్లి ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం నిజాంపేట మండలం నార్లాపూర్ హైదర్ చెరువుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ‘గోదావరి జలాలు మెతుకు సీమకు వస్తాయని చరిత్రలో ఏరోజైనా కలగన్నమా? సీఎం కేసీఆర్ గోదావరి నీళ్లు తెస్తానంటే మేము బతికుండగా చూస్తామా? నీళ్లు వస్తాయా? అని ఎద్దేవా చేసిన కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చేప్పే సమయం ఆసన్నమైనది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని రకాలుగా అడ్డంకులు వేసినా, కోర్టుల్లో కేసులు వేసినా, భూములు ఇవ్వకుండా అడ్డుపడినా నీతి, నిజాయితీతో, చిత్తశుద్ధితో, గట్టిగా కంకణం కట్టుకొని ఈ రోజు గోదావరి జలాలను మెతుకు సీమకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అని వెల్లడించారు. మేడిగడ్డ దగ్గర ఉన్న గోదావరిని వందల కిలోమీటర్లు దూరం తీసుకొచ్చి 20 తాటిచెట్ల ఎత్తుకు ఎత్తి చేగుంట మండలంలో పారించడమంటే మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఝూటా మాటల కాంగ్రెస్, బీజేపీని నమ్మవద్దని, వారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుందని అన్నారు.
కేసీఆర్ సీఎం కాకపోయుంటే మన వాకిట్లోకి గోదావరి జలాలు వచ్చేవా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మిషన్ భగీరథతో తాగునీరు, కాళేశ్వరంతో సాగునీరు అందించారని తెలిపారు. కొందరు నిందలు, ఝూటా మాటలతో టీవీలు, సోషల్ మీడియాల్లో గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలను కోరారు. కండ్ల ముందు కనిపిస్తున్న గోదావరి జలాలను చూడాలని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ ప్రాజెక్టులను కూలగొడుతామని అంటున్నాయని, ప్రాజెక్టులు కట్టేవాళ్లు కావాల్నో? కూలకొట్టేవాళ్లు కావాల్నో? ఆలోచించాలని హరీశ్రావు రైతులకు సూచించారు. ‘కేసీఆర్ సంపద పెంచిండు.. పేదలకు పంచిండు. ప్రాజెక్టులు కట్టిండు.. రైతులకు నీళ్లు ఇచ్చిండు’ అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలో ఒకడు కూలగొడుతానని, ఇంకొకడు పేల్చేస్తానని అంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ పేదలను కొట్టి కార్పొరేట్లకు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని.. కానీ సంపదను పెంచి, పేదలకు పంచే నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
సీఎం కేసీఆర్ రోజుకు రూ.30 కోట్లు వెచ్చించి రైతుల కోసం వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి తెచ్చినా సీఎం కేసీఆర్ ససేమిరా అన్నారని గుర్తు చేశారు. రూ.30 వేల కోట్ల నజరానా రాష్ర్టానికి ఇస్తామని మభ్యపెట్టినా సీఎం అంగీకరించలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టారని, ఆ కన్నీళ్లు మళ్లీ చూడొద్దనే సీఎం కేసీఆర్ ఎన్నో కష్టాలకోర్చి కాళేశ్వరం ద్వారా సాగు, తాగు నీటిని అందిస్తున్నారని తెలిపారు.