వీళ్ల చేతిలో కత్తిలేదు.. వాళ్లకు నెత్తిలేదు.. టీఆర్ఎస్ తపనంతా రాష్ట్ర అభివృద్ధే
పాలమూరుకు జాతీయహోదా ఇచ్చాకే రాష్ట్రంలో ప్రధాని మోదీ అడుగుపెట్టాలి
కేంద్రం బకాయిలు రూ. 11 వేల కోట్లను బీజేపీ నాయకులు తేవాలి: మంత్రి హరీశ్
నారాయణపేటలో 64.43 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నారాయణపేట, మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 6: కాంగ్రెస్ చేతిలో కత్తిలేదు.. బీజేపీ నాయకులకు నెత్తిలేదు.. ఒకరికి కులం పిచ్చి పట్టుకుంటే.. మరొకరికి మతం పిచ్చి పట్టుకున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన ఆయన ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి రూ.64.43 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అప్పక్పల్లి గ్రామ శివారులో నిర్మించనున్న 390 పడకల జిల్లా దవాఖాన ప్రాంగణంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. అభివృద్ధే అభిమతంగా టీఆర్ఎస్ సర్కారు దూసుకెళ్తున్నదని తెలిపారు. 70 ఏండ్ల గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో మూడే వైద్య కళాశాలలు ఉండేవని, తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే వైద్య కళాశాల సంఖ్యను 33కు పెంచామని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన నారాయణపేట.. స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని అన్నారు.
రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి ప్రజల అదృష్టమని చెప్పారు. కిడ్నీ సమస్యలు వస్తే ఇతర జిల్లాలు, ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా డయాలసిస్ చేయించుకొనే అవకాశాన్ని ఇప్పటి నుంచి కల్పిస్తున్నట్టు వివరించారు. ఇక్కడి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసినట్టు తెలిపారు. నారాయణపేటకు కూత వేటు దూరంలో ఉన్న కర్ణాటకలో బీజేపీ పాలన ఉన్నదని, అక్కడ తెలంగాణ లాంటి పథకాలు అమలవుతున్నాయా? అన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో మిషన్ భగీరథతో శుద్ధమైన నీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, కర్ణాటకలో ఏ ఒక్క గ్రామానికైనా మంచినీరు అందిస్తున్నారా? అని ప్రశ్నించారు.
‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి
కర్ణాటకలోని అప్పర్భద్ర, ఏపీలోని పోలవరం, మధ్యప్రదేశ్లోని పెన్గంగ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వటం లేదని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఈ విషయమై మోదీ సర్కార్కు ఎన్ని సార్లు మొరపెట్టుకొన్నా స్పందన కరువైందని ధ్వజమెత్తారు. వచ్చే నెలలో రాష్ర్టానికి వస్తున్న ప్రధాని మోదీ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి 3 నెలలుగా రావాల్సిన రూ.11 వేల కోట్లు తీసుకురావాలని బీజేపీ నాయకులను నిలదీశారు. కాగా, నారాయణపేట జిల్లాలోని 21 ప్రైవేటు దవాఖానల్లో సాధారణ ప్రసవాలకంటే సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువవుతున్నాయని ప్రైవేటు గైనకాలజిస్టులపై మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు అభివృద్ధే ధ్యేయమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ తర్వాత నారాయణపేట మున్సిపాలిటీగా అవతరించిందని, ఈ పట్టణం చీరలు, బంగారానికి ప్రసిద్ధి అని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వనజ, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, డాక్టర్ అబ్రహం, కలెక్టర్ దాసరి హరిచందన, రాష్ట్ర మైనారిటీ అసోసియేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, వైద్య విధాన పరిషత్తు కమిషనర్ అజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ బట్టడ్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ అంజలి, సర్పంచులు వెంకటమ్మ, సుగుంధమ్మ, నాయకులు పాల్గొన్నారు.
పాత కలెక్టరేట్ స్థానంలో కొత్త దవాఖాన
పాలమూరులోని పాత కలెక్టరేట్ స్థానంలో కొత్త దవాఖాన నిర్మిస్తామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సోమవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానను మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి తనిఖీ చేశారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడారు. అక్కడ అందుతున్న సేవలు.. ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకొన్నారు. దవాఖానలోని ఐసీయూ, లేబర్ రూం , జనరల్ వార్డు, డయాలసిస్ సెంటర్తోపాటు వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు మోకాలు చిప్ప ఆపరేషన్లకు అవసరమైన యంత్ర పరికరాలను 24 గంటల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లా దవాఖాన డాక్టర్ల పనితీరు బాగున్నదని, ఇంకా బాగా పనిచేయాలని సూచించారు.