యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఒక రోజు ముందుగానే యాదగిరిగుట్టకు సీఎం కానుక అందింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని గుట్టలో వంద పడకల ప్రభుత్వ దవాఖానకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ దవాఖానలో స్థానికులతోపాటు పరిసర మండలాల ప్రజలు, గుట్టకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో 100 పడకల దవాఖానకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని చెప్పారు. ఒక ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్టు హరీశ్రావు చెప్పారు.
ఎంత ఖర్చయినా రైతులకు ఫుల్ కరెంట్..
విద్యుత్ శాఖకు అదనంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని, ఎంత ఖర్చయినా విద్యుత్ కొని రైతులకు ఫుల్ కరెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. రోజుకు దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసి కరెంట్ కొంటున్నామని, యూనిట్కు రూ.25 నుంచి రూ.30 ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఎండాకాలంలో ఒక గుంట కూడా ఎండొద్దనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. ఇందుకోసం తాము రాత్రీపగలు కష్టపడుతున్నట్టు చెప్పారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ తెలంగాణలెక్క కరెంట్ ఇస్తలేరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద రూ.65 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.5,400 కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు.
బీబీసీపై దాడులతో దేశం పరువుపోతున్నది
బీబీసీపై ఐటీ దాడులు చేయడం దారుణమని, ఇది చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీబీసీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ అని, ఆ సంస్థపై దాడి చేసి దేశం పరువు తీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీబీసీలో ఒక వార్త వచ్చిందని తెల్లారి ఐటీ దాడులు చేయించారని, ప్రపంచం ముందు దేశం పరువు పోతున్నదని వాపోయారు. నాయకులకు ఓపిక, సమాధానం చెప్పే శక్తియుక్తులు ఉండాలని, ఇలా దాడులు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఐటీ, ఈడీలను తోలుతా అంటే దేశం పరువు పోదా? అని ప్రశ్నించారు.
నోటిఫికేషన్లు వేస్తే బీజేపీకి బాధైతున్నది
రాష్ట్ర ప్రభుత్వం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే..బండి సంజయ్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ‘ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే మాకు కార్యకర్తలు ఎట్లా అంటున్న బండి సంజయ్.. మీది కుట్ర కాదా?’ అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇస్తే సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నడని, కడుపులో ఉన్న అసలు విషయాన్ని బయటకు కక్కాడని విమర్శించారు. ఉద్యోగాలు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వానిది కుట్ర అవుతుందా? ఉద్యోగాలు ఇస్తే ఏడ్చే బండి సంజయ్ది కుట్ర అవుతుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. కొత్త ఉద్యోగాల కోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించామని గుర్తుచేశారు.
ఎన్నికల కోసం గుళ్లు.. బీజేపీ సంస్కృతి
యాదగిరిగుట్టను అద్భుతంగా పునర్నిర్మించామని, ఓట్లకోసం ఎన్నికల ముందు ప్రారంభించలేదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓట్లప్పుడు ఎకడా చెప్పుకోలేదని వెల్లడించారు. ఎన్నికలు అయ్యేదాకా గుళ్లు కట్టి, ఎన్నికల ముందు ప్రారంభించే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. బీజేపీ లెక మతాన్ని రాజకీయం కోసం వాడుకొనే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు.
ఈసారి పేల్చేటోళ్లు, కూల్చేటోళ్ల డిపాజిట్లు గల్లంతే
‘బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే.. కాంగ్రెసోళ్లు పేల్చేస్తామంటరు. బీజేపోళ్లు కూల్చేస్తామంటరు. బిడ్డా.. మీరిట్లనే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ డిపాజిట్లు గల్లంతు చేస్తరు’ అని కాంగ్రెస్, బీజేపీ నేతలను మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. పేల్చేటోని చేతికో.. కూల్చేటోని చేతికో పోతే తెలంగాణ ఆగమైతదని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఒకరు కుట్ర అని, అంబేదర్ పేరు మీద సచివాలయం నిర్మిస్తే ఇంకొకరు కూలుస్తమని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఏం చేసినా ప్రజల కోసమేనని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో 33 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.
కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని మంత్రి హరీశ్రావు సతీసమేతంగా దర్శించుకొన్నారు. మధ్యాహ్నం కొండపైకి వెళ్లిన మంత్రి దంపతులు మొదట స్వయంభూ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి అర్చకులు వేద ఆశీర్వచనం, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.