హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): వేడి వేడి ఇడ్లీ సాంబార్.. పూరీ ఆలుకుర్మా.. ఉగ్గాని పల్లిచట్నీ.. రాగిఇడ్లీ పల్లీ చట్నీ.. రవ్వకేసరి. ఇలా తీరు తీరు టిఫిన్లు.. తీరొక్క రుచులను విద్యార్థులు ఆస్వాదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి డైనింగ్ టేబుళ్ల మీద కూర్చొని పల్లెంలో వడ్డించిన అల్పాహారాన్ని రుచి చూశారు. రోజూ ఆలస్యంగా వచ్చే విద్యార్థులు పరుగుపరుగున బడులకు చేరారు. ఉదయాన్నే ఉత్సాహంగా బడికి పరుగెత్తుకొచ్చి ఆకలి తీర్చుకున్నారు. సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలితీర్చే ‘సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం’ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా పథకం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులందరూ విద్యార్థులతో కలిసి టిఫిన్లు ఆరగించారు. మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి చిన్నారులకు ఇడ్లీలు తినిపించారు. అల్పాహారం రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్షయపాత్ర, మన్నా ట్రస్ట్ల ద్వారా బ్రేక్ఫాస్ట్ను వడ్డించగా, మిగతా జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు అల్పాహారాన్ని సిద్ధం చేశారు. దసరా నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బడుల్లోని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేయనున్నారు.
చిన్నారులు బడికొస్తే చాలు.. రెండు పూటలా ఆహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. కడుపునిండా తిండి.. బుర్ర నిండా చదువులను అందిస్తున్నది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, తాగేందుకు శుద్ధమైన మిషన్ భగీరథ నీళ్లు. ఒంటి గంటకు మధ్యాహ్న భోజనం.. అదీ సన్నబియ్యంతో వండినది.. ఆకుకూరలు, రోజూ పప్పు, కూరగాయలు.. వారంలో మూడు రోజులు ప్రోటీన్ల సమ్మేళనమైన కోడిగుడ్డు లేదా శక్తినిచ్చే అరటిపండ్లు, రాగిజావాను సమకూరుస్తున్నది. పేదలు, కష్టజీవుల పిల్లల ఆకలితీర్చేందుకు మానవీయకోణంలో పథకాలను అమలు చేస్తున్నది. ప్రభుత్వమే తల్లి, తండ్రి అయ్యి 23 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఉదయాన్నే బడికి వస్తే చాలు సాయంత్రం ఇంటికెళ్లే వరకు విద్యార్థుల కడుపు నింపుతున్నది. చదువులపరంగా తొలిమెట్టు, లర్నింగ్ ఇంప్రూవ్మెంట్, లక్ష్య వంటి కార్యక్రమాలతో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషిచేస్తున్నది. నాష్తా, బువ్వపెట్టి చక్కని చదువులు చెప్పి నిరుపేద బిడ్డల బంగారు భవిష్యత్తుకు తెలంగాణ సర్కారు చుక్కానిలా నిలుస్తున్నది.
నాకు నాన్న లేడు. కుటుంబ పోషణ కోసం అమ్మ ఓ కంపెనీలో పనిచేస్తుంది. తమ్ముడు, నేను చదువుకుంటున్నాం. పనికెళ్లే హడావిడిలో అమ్మ ఏదో ఒకటి చేసిపెడుతుంది. ఒక్కోసారి ఏం లేకపోవడంతో వారంలో రెండు రోజులు ఏం తినకుండానే బడికొచ్చేదానిని. గతంలో ఓసారి ప్రార్థన సమయంలోనే కండ్లు తిరిగి పడిపోయా. అప్పుడప్పుడు చక్కరొచ్చినట్లు అయ్యేది. చదువు మీద శ్రద్ధపెట్టేదాన్ని కాదు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంలో స్కూల్లోనే టిఫిన్ పెడుతుండటంతో మా చింతలన్నీ దూరమయ్యాయి. స్కూల్లో పెట్టిన టిఫిన్లు రుచికరంగా ఉన్నాయి.
– అక్షిత, పదో తరగతి (రావిర్యాల జడ్పీహెచ్ఎస్)
మా అమ్మానాన్న ఆర్సీఐ కంపెనీలో పనిచేస్తారు. ఉదయం 7:30 గంటలకే డ్యూటీకి వెళ్తారు. మా అమ్మ ఉదయం 5 గంటలకే లేచి టిఫిన్లు సిద్ధం చేస్తుంది. దోస, ఇడ్లీ, ఉప్మా ఇలా రోజుకో వెరైటీ చేసిపెడ్తుంది. మేం ఇంట్లో తినే టిఫిన్లనే స్కూల్లో పెడుతున్నారు. దీంతో అమ్మకు కష్టం తప్పింది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు, అరటిపండ్లు, రాగిజావ ఇస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతుండటం ఆనందంగా ఉన్నది.
-దీక్షిత, 8వ తరగతి (రావిర్యాల జడ్పీహెచ్ఎస్)
సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీం దేశానికే ఆదర్శమైన పథకం. సీఎం కేసీఆర్ చొరవకు ధన్యవాదాలు. పేద విద్యార్థులు అర్ధాకలితో పాఠశాలకు రావొద్దన్న ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టడం శుభసూచకం. ఈ పథకంతో పౌష్టికాహారం అందడమే కాకుండా, విద్యార్థుల డ్రాపౌట్ రేట్ తగ్గుతుంది.
– ఎం చెన్నయ్య, టీచర్ (హిమాయత్సాగర్ స్కూల్)