బోరంచ గ్రామానికి పిల్లను ఇవ్వొద్దు.. హద్నూర గ్రామానికి ఎద్దును ఇవ్వొద్దు అనే నానుడి గతంలో ఉండేది.. బోరంచకు పిల్లనిస్తే నీళ్లు మోసి పిల్ల భుజాలు కాయలు కాస్తాయని బోరంచకు ఆడపిల్లను ఇచ్చేవారు కాదు.. హద్నూర గ్రామానికి ఎద్దును పంపితే నీళ్లు, గడ్డి లేక బక్కచిక్కేదని అనుకొనేవారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలో నాటి సామెతను తిరగరాసినం.
-మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో కరువు ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గం కోనసీమలా మారనున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర పథకాల ద్వారా సంగారెడ్డి జిల్లా అన్నపూర్ణగా మారుతుందని ఆకాంక్షించారు. గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాలోని సాగు భూముల్లో పారించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కంకణం కట్టుకున్నారని.. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు, అక్కడి నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి జిల్లాకు తరలిస్తారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచ గ్రామంలో రూ.1,774 కోట్లతో నిర్మిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు శనివారం హరీశ్రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వరుని పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు దండుకొనే ప్రయత్నం చేసిందని, ఆ తర్వాత బసవేశ్వరుడిని మరిచిపోయిందన్నారు. మహనీయుడైన బసవేశ్వరుని సీఎం కేసీఆర్ మరువలేదని.. ఎందరికో ఆరాధ్యదైవమైన బసవేశ్వరుని విగ్రహం ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. హైదరాబాద్లో బసవేశ్వర భవన్ నిర్మించడంతో పాటు అధికారికంగా ఆ మహాత్ముడి జయంతి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే ఎత్తిపోతల పథకానికి బసవేశ్వరుని పేరు పెట్టినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ బసవేశ్వరున్ని ప్రేమించి, సేవించిన వ్యక్తిగా అభివర్ణించారు. సంగారెడ్డి జిల్లాలోని రెండు ఎత్తిపోతల పథకాలకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలుగా నామకరణం చేసినట్టు స్పష్టంచేశారు.
బసవేశ్వరతో 1.65 లక్షల ఎకరాలకు నీరు
నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు. శివుడి పాదాల (కాళేశ్వరం) నుంచి గోదావరి జలాలు ప్రవహించి బోరంచలోని పోచమ్మ అమ్మవారి పాదాలకు చేరుకోనున్నట్టు తెలిపారు. బసవేశ్వర పథకం నిర్విఘ్నంగా పూర్తి కావాలని, జిల్లా సస్యశ్యామలం కావాలని బోరంచ అమ్మవారికి బంగారు ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నట్టు తెలిపారు.
కర్ణాటక సరిహద్దున ఉన్న నారాయణఖేడ్లో మహిళలు నీటి కోసం మైళ్ల దూరం నడిచేవారని, ఇలాంటి ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసి నారాయణఖేడ్ను మరో కోనసీమగా మారుస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని రైతుల విలువను కేసీఆర్ పెంచారని, తద్వారా భూముల ధరలు పెరిగి రైతులు లాభపడుతున్నట్టు తెలిపారు. సింగూరు జలాలు మెదక్ జిల్లా హక్కు అన్న నినాదాన్ని సాకారం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్టు చెప్పారు. బసవేశ్వర ఎత్తిపోల పథకం ద్వారా 1.65 లక్షల ఎకరాలకు, సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు.
దేవుళ్ల పేర్లతో ప్రతిపక్షాల రాజకీయాలు
రాష్ట్రంలో కొంతమంది దేవుళ్లను అడ్డుపెట్టుకుని మత రాజకీయాలు చేస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులం, మతం పేరిట చిచ్చురేపి కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. అలాంటి కుటిల రాజకీయ పార్టీల తరహాలో సీఎం కేసీఆర్ దేవుళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఏ ప్రజాసంక్షేమ కార్యక్రమం చేపట్టినా దేవుడి దీవెన తీసుకొని తెలంగాణలో చక్కని పాలన సాగిస్తున్నట్టు స్పష్టంచేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు మఠం భిక్షపతి, సువర్ణ షెట్కార్, రవీందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి బాటలో నారాయణఖేడ్
సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ చరిత్రను తిరగరాశారని హరీశ్రావు అన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో నారాయణఖేడ్ అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. నాడు ప్రజలు జైళ్లు, బెయిళ్లు మాత్రమే చూశారని చెప్పారు. ఈ ప్రాంత నేతలు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, గంజాయి అక్రమ రవాణా ద్వారా కోట్లు గడించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ వచ్చాక ఈ ప్రాంత దశ మారిందని.. అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు విద్యుత్తు, మంచినీరు, సాగునీరు, రహదారుల కష్టాలను తొలిగించారని స్పష్టంచేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఉపాధి కోసం వలస పోతే, ప్రస్తుతం బీఆర్ఎస్ పాలనలో నారాయణఖేడ్లో పనులు చేసేందుకు ఆంధ్ర, ఒడిశా, బెంగాల్ నుంచి కూలీలు వస్తున్నారని చెప్పారు.
భూములిచ్చి రైతులకు అండగా ఉంటాం
బసవేశ్వర ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు. ఎత్తిపోతల పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. అనంతరం అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. బసవేశ్వర పథకంతో అందోలు నియోజకవర్గంలోని రేగోడ్, వట్పల్లి మండలాల్లోని సాగుభూములకు నీరు అందుతుందని చెప్పారు.
– ఎమ్మెల్యే భూపాల్రెడ్డి