నంగునూరు, మార్చి 29: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగుకు తొలిసారి కాళేశ్వరం జలాలు చేరాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ఈ వాగుపై మొత్తం తొమ్మిది చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రస్తుతం ఒక చెక్డ్యామ్ నిండగా, దిగువన మరో చెక్డ్యామ్కు గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. బుధవారం నంగునూరు మండల కేంద్రంలోని పెద్దోల్ల బంగ్లాకాడ వద్ద గల చెక్డ్యామ్లో మంత్రి హరీశ్రావు గంగమ్మకు జలహారతి పట్టారు. ఈ సందర్భంగా గోదావరి నీళ్లను చూసిన రైతులు మురిసిపోయారు. ఆనందంతో వాగులోకి దిగి గోదావరి నీటిని ఒకరిపై ఒకరు చల్లుకొంటూ మైమరిచిపోయారు. అనంతరం మంత్రి హరీశ్రావును శాలువాతో సన్మానించి, మిఠాయిలు పంచిపెట్టారు.
ఎగువతోపాటు స్థానికంగా కురిసిన వానలకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగుకు వరద వచ్చి నీరంతా వృథాగా పోయి శనిగరం చెరువులో కలిసేది. సాగునీరు లేక కరువుతో అల్లాడిన నంగునూరు మండల రైతులకు పెద్దవాగు నీరు వృథాగా దిగువకు పోవడం బాధ అనిపించేది. నీళ్లు తలాపు నుంచి పారుతున్నా ఉపయోగించుకోని దైన్యస్థితి వారిది. వృథా నీటికి అడ్డుకట్ట వేసి చెక్డ్యామ్లు నిర్మించాలని కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలోచన చేసి ఘనపూర్-అక్కెనపల్లి గ్రామాల శివారులో పెద్దవాగుపై చెక్డ్యామ్ నిర్మించారు. చెక్డ్యామ్తోపాటు వాగు అవతలి గ్రామాలకు వెళ్లడానికి అక్కెనపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు మరో 8 చెక్డ్యామ్లు నిర్మించారు. పెద్దవాగుపై చెక్డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో నీరు అందుబాటులోకి రావడంతో బంగారు పంటలు పడుతున్నాయి. వాగు పరీవాహకంలో సుమారు 5 వేల ఎకరాల వరకు పచ్చని పంట పొలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. ప్రస్తుతం గోదావరి జలాలు రావడంతో మండుటెండల్లోనూ పెద్దవాగు జీవనదిని తలపిస్తున్నది. ఈ చెక్డ్యామ్ స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టి చెరువులను అభివృద్ధి చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు.
తెలంగాణలో యాసంగిలో 56 లక్షల ఎకరా ల్లో వరి పంట వేశారని, నాడు వడ్లు అంటే గోదావరి జిల్లాలు, కోనసీమ లాంటి ప్రాంతాలే ఉండేవని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, ఏపీలో కేవలం 16 లక్షల ఎకరాల్లోనే పండిస్తున్నారని తెలిపారు. నాటికి, నేటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదని చెప్పారు. సగం భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని, ఇది సీఎం కేసీఆర్ సాధించిన గొప్ప విజయమని అ న్నారు. ‘నాడు కాంగ్రెస్ హయాంలో గుంట ఎండకుండా పంట పండించిన రైతే లేడు. నేడు సీఎం కేసీఆర్ హయాంలో గుంటా ఎండకుండా పంట పండిస్తున్నరు. అందుకే ప్రతి రైతు గుండెలో సీఎం కేసీఆర్ ఉన్నారు. గతంలో పనిలేక పొట్ట చేత పట్టుకొని బొంబాయి, దుబాయిలకు పోయాం. కానీ నేడు ఛత్తీస్గఢ్, బీహార్ నుంచే కాక నేపాల్ నుంచీ నాట్లు వేసేందుకు వస్తున్నారు’ అని వెల్లడించారు. నాడు ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో లంచం అడిగేవారని, నేడు బిస్కెట్ల మాదిరిగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చామని చెప్పారు. బాయికాడ మీటర్లు పెడితేనే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని, కానీ కేసీఆర్ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బాయికాడ మీటర్లు పెట్టనని చెప్పారని గుర్తుచేశారు.