హైదరాబాద్ : లంకెబిందెల కోసమే పురాతమైన ఆలయాలను కూల్చివేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం రాదని శాసనసభ విపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఖానపురం మండలం అశోక్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన 800 ఏండ్ల చారిత్రక కాకతీయ కట్టడం శివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుప్త నిధుల కోసం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. స్కూల్ నిర్మాణం కోసం అయితే అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు.
గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వాకాలు చేపట్టారని పురావస్తు శాఖ తేల్చింది. ఆలయాల కూల్చివేతపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుంత్వం రాగానే దేవాదాయ శాఖ భూమి ప్రభుత్వ భూమిగా మారిందన్నారు. గుప్త నిధుల వేటలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్నారు. పేదల ఇళ్లతో పాటు గుళ్లను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ జిల్లాలో ఎన్నో ఆలయాలను పునరద్ధరించాం.
రామప్ప ఆలయానికి బీఆర్ఎస్ యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ధ్వంసం చేసిన శివాలయాన్ని పునర్మిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సూదర్శన్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, అరూరి రమేష్, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.