సంగారెడ్డి, జూన్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని, తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినం రోజు దగా పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం కాంగ్రెస్పార్టీ పైశాచికత్వానికి నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మంత్రి హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతీరును దుయ్యపట్టారు. అమరుల సంస్మరణ దినం రోజున కాంగ్రెస్ పార్టీ దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
అమరుల త్యాగాలు స్మరించుకోవటం కాంగ్రెస్కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా దశాబ్ది వేడుకలు జరుపుకొంటుంటే కాంగ్రెస్ పార్టీకి కండ్లు మండుతున్నాయని విమర్శించారు. దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్ ఎన్నో ఏండ్లుగా దగా చేసిందని, అలాంటి పార్టీ ఇప్పుడు దగా పేరుతో నిరసనలు చేపట్టడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అయితే అవరోధాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.