హైదరాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ను, కేసీఆర్ను మానసికంగా కుంగదీసి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అప్రజాస్వామికం, అనైతికం, అక్రమమని, కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈడీ అధికారులు శుక్రవారం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో హరీశ్రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కుట్రపూరితమని పేర్కొన్నారు. ఏడాది క్రితం కవితకు సాక్షిగా నోటీసు ఇచ్చి, ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బతీయాలన్న దురుద్దేశం, బురదజల్లాలనే పథకంలో భాగంగానే కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని దుయ్యబట్టారు.
ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదు
కవిత అరెస్ట్ను కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కుగా హరీశ్రావు అభివర్ణించారు. ఈ రెండు పార్టీల దుర్మార్గమైన చర్యను ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామని, ప్రజాక్షేత్రంలో ఆ రెండు పార్టీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఉదయం సెర్చ్ అన్నారని, సాయంత్రానికి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈడీ అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చారని, అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు విమాన టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకున్నారని తెలిపారు. కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా సాయంత్రం 6 తర్వాత అరెస్ట్ చేశారని వివరించారు.
బీఆర్ఎస్కు ఉద్యమాలు కొత్తేమీ కాదు
బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని, తమకు అరెస్ట్లు, వేధింపులు, కుట్రలు కొత్తవేమీ కాదని హరీశ్రావు పేర్కొన్నారు. ఇలాంటివెన్నో ఛేదించి రాష్ర్టాన్ని సాధించామని చెప్పారు. కవిత అక్రమ అరెస్ట్పై ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తూనే, న్యాయపరంగానూ ఎదుర్కొంటామని తెలిపారు.సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయపరంగా కొట్లాడుతామని చెప్పారు.
సుప్రీంలో కేసు నడుస్తుండగా అరెస్ట్ ఎందుకు?
పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కుటుంబసభ్యురాలిపై, నళిని చిదంబరంపై, కవితపై.. ఇలా మహిళలను ఈడీ అరెస్ట్ చేయొచ్చా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్నదని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చిందని, 19కి వాయిదా పడిందని తెలిపారు. అయితే అంతకు ముందే ఈ కేసులో కవితపై తీవ్రమైన చర్యలు తీసుకోబోమని స్వయంగా ఈడీనే సుప్రీంకోర్టుకు తెలిపిందని గుర్తుచేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాటకు విరుద్ధంగా, ఒక మహిళను శుక్రవారం రోజు, అదీ రాత్రిపూట అరెస్ట్ చేయడం కచ్చితంగా రాజకీయ కుట్రేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో మూడు రోజుల్లో ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ఉండగా అంత అర్జెంట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
పార్లమెంట్ ఎన్నికల్లో తమను దెబ్బతీయాలనే కుట్రతోనే అరెస్ట్ చేశారనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదని హరీశ్రావు పేర్కొన్నారు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితి ఇది అని, దౌర్జన్యంగా కవి త అరెస్ట్ జరిగిందని విమర్శించారు. కక్షసాధింపు రాజకీయాలకు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర: జగదీశ్రెడ్డి
కవిత అరెస్ట్ను రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. కవితకు సంవత్సరమున్నర క్రితమే నోటిసులు ఇచ్చినా విచారణకు సహకరించారని తెలిపారు. బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి, లొంగదీసుకోవడానికి, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. గడిచిన పదేండ్లలో అనేక రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడం, వారు బీజేపీలో చేరగానే వాటిని రద్దు చేయడం జరుగుతున్నదని చెప్పారు.. అదే పద్ధతిలో బీఆర్ఎస్ను, కేసీఆర్ను లొంగదీసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసిందని, కానీ దేశంలో బీజేపీకి కేసీఆర్ ఎదురునిలిచారని, అది సహించలేక దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.