మెదక్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వడ్లు వద్దు కానీ, తెలంగాణ ఓట్లు కావాలా? అని బీజేపీపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసిన బీజేపీ.. అధికారం మాత్రం కావాలని చూస్తున్నదని ఆరోపించారు. మెదక్ జిల్లాలోని హవేలీఘనపూర్ మండలం దూప్సింగ్ తండా వద్ద కూలిపోయిన బ్రిడ్జిని మంత్రి గురువారం పరిశీలించారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులు మొన్నటిదాకా వడ్లు కొంటాం.. బియ్యం తీసుకొంటాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. జబ్బులు చరుచుకొని మాట్లాడిండ్రు. దేశం మొత్తం వడ్లు కొంటున్నారు.
పంజాబ్లో పండించిన పంట కొంటున్నారు. తెలంగాణలో పండించిన పంటను ఎందుకు కొనరని ఢిల్లీలో ధర్నాలు చేసినం. అయినా మొండికేసిండ్రు. తొండాట ఆడిండ్రు. కొంటాం గానీ దొడ్డు బియ్యం కొనం.. రా రైస్ మాత్రమే కొంటమని మెలిక పెట్టిండ్రు. తెలంగాణలో పండించేదే బాయిల్డ్ రైస్. మరి వడ్లు కొంటమన్న బీజేపీ నాయకులు ఎటుపోయిండ్రు?’ అని బీజేపీ రాష్ట్ర నాయకులను ప్రశ్నించారు. తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనబోమని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, నూక నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సీఎం కేసీఆర్ ధైర్యం చేశారని, రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యం కొన్నారని తెలిపారు.
తెలంగాణలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నదని, మోయడానికి కూలీలు దొరకటం లేదని, హమాలీలు లేరని, దాయడానికి గోదాములు సరిపోవడం లేదని, చాలాచోట్ల కవర్లు కప్పి ధాన్యపు రాశులు గుట్టలు గుట్టలుగా ఉన్నాయని వివరించారు. అయినా ఇప్పటికీ కేంద్రం రా రైస్ కొనడం లేదని, బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. ఇక్కడున్న బీజేపీ నాయకుల గొంతులు ఎందుకు మూగబోయాయని నిలదీశారు. వీటన్నింటికీ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర బీజేపీదని విమర్శించారు. రైతుల బాయి కాడ మీటర్లు పెట్టబోమని చెప్పినందుకు రాష్ర్టానికి రావాల్సిన రూ.6,500 కోట్లు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నదని ఆరోపించారు.
ఈ వానకాలం రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేసిందని మంత్రి హరీశ్రావు చెప్పారు. కష్టకాలంలో టీఆర్ఎస్ సర్కారు రైతుబంధు ఇస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇస్తున్నారా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. వడ్ల సెంటర్ల వద్దకు బండి సంజయ్ తిరిగారని, ఇప్పుడు వడ్లు మొలకెత్తుతుంటే బీజేపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని విమర్శించారు. తెలంగాణలో పంట పండితే ఓర్చుకోలేక పోతున్నదని ఆరోపించారు. తెలంగాణ రైతు ఆగ్రహ జ్వాలలో ఆ పార్టీ మాడి మసైపోతదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.