సిద్దిపేట: తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్నదని చెప్పారు. నాడు సిద్దిపేట నుంచే కేసీఆర్ సైకిల్ యాత్ర చేపట్టి వరంగల్ సభకు ఊళ్లకు ఊళ్లు కదిలించారని గుర్తుచేశారు. చాలా పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. కానీ బీఆర్ఎస్ మాత్రం లక్ష్యాన్ని ముద్దాడిందని తెలిపారు. కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందన్నారు. 14 ఏండ్ల ఉద్యమం, పదేండ్ల ప్రభుత్వం, ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం.. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షమేనని స్పష్టం చేశారు. లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలింది. నేడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలిందని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గం కేంద్రం రంగదాంపల్లి అమర వీరుల స్థూపం నుంచి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి, యువత చేపట్టిన పాదయాత్రను హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఈరోజు మన సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరిన విద్యార్థి యువ మిత్రులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. 44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 1500 మంది ఈనెల 27న వరంగల్లో జరగబోయే పార్టీ రజతోత్సవం కోసం స్వచ్ఛందంగా తరలివచ్చిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినావాభావ సంబంధం ఉంది. ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కైనా, 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన సందర్భమైనా సిద్దిపేటకు పేగు బంధం ఉంది. మీరు చేస్తున్న ఈ పాదయాత్ర రేపటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్నది. బీబిఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. గాలి బుడగ లాంటిది, పాలపొంగు లాంటిదని, అమాసకు పుట్టింది పున్నానికి పోతది అని కూడా అన్నారు. మనల్ని అన్న వాళ్లు ఆగమయ్యారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు. చాలా పార్టీలు పుడుతుంటాయి.. పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచింది. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్, గాంధీల మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అని అన్నారు. అదే పద్ధతిలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ప్రజలందరికీ తెలంగాణ ఎందుకు అవసరమో బోధించారు. సమైక్యవాదులపై, ఢిల్లీ పెద్దలపై పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారు.
1969లో చాలామంది అమరులయ్యారు. ఎంతోమంది విద్యార్థులు మరణించారు. పోలీస్ కాల్పుల్లో 369 మంది చనిపోయారు. ఆనాటి హింసను దృష్టిలో పెట్టుకొని మలిదశ ఉద్యమంలో కేసీఆర్.. గాంధీ గారు చూపిన బాటలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం, ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షం. రాష్ట్ర సాధన కోసం, మన ఆత్మగౌరవం కోసం 14 ఏండ్లు పోరాటం చేశాం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపాం. ధాన్యం ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో తెలంగాణను నంబర్ వన్గా నిలిపాం. అంతేకాదు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఆ పార్టీ చెప్పిన మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయి. ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన, ప్రజల మధ్యలో ఉండి కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈరోజు ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలి. ఆరోజు లంకలో రావణుడు చేసే అరాచకాలను ఎదిరించడానికి రామదండు కదిలింది. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది. మూడు రోజులపాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గులాబీ దండు రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి కదిలింది. ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి అందరూ క్రమశిక్షణతో ట్రాఫిక్కు ఇబ్బందులు జరగకుండా నడవాలి. ఎవరికి చిన్న ప్రమాదం కానీ గాయం కానీ జరిగితే నా గుండె బాధపడుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నా. పాదయాత్రలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను వివరించండి. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటాను. గ్రామాల వారీగా, మండలాల వారీగా, పట్టణాల వారీగా టీములు క్రమశిక్షణతో ముందుకు సాగాలి. మీకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తాం. కంటికి రెప్పలా చూసుకునేందుకు మన పార్టీ సీనియర్ నాయకులు మిమ్మల్ని పర్యవేక్షిస్తారు.’ అని తెలిపారు.