పటాన్చెరు, మార్చి 15: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలను కానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను కానీ ఏనాడూ వేధించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి అరెస్టును హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. తమ పార్టీలో చేరాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువులపై ఒత్తిడి తీసుకొస్తున్న కాంగ్రెస్ వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. పాలనను గాలికి వదిలి, ప్రతిపక్షాలను వేధిస్తున్నారని విమర్శించారు. వందలమంది పోలీసులతో వచ్చి తెల్లవారుజామున అరెస్ట్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధుసూదన్రెడ్డి ఏమైనా బందిపోటా? అని ప్రశ్నించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే క్రషర్లపై విచారణ నిర్వహిస్తున్నామని స్వయంగా ఆర్డీవో చెప్పిన వీడియోను మంత్రి ఫోన్లో చూపించారు. మధుసూదన్రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని హరీశ్రావు భరోసా ఇచ్చారు. తమ్ముడి అరెస్టుతో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. క్రషర్ను పూర్తి అనుమతులతోనే నడిపిస్తున్నామని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు.
హరీశ్రావు పరామర్శ
మధుసూదన్రెడ్డి అరెస్ట్ సమాచారం అందుకున్న హరీశ్రావు వెంటనే పటాన్చెరు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు సఫానదేవ్, శంకర్యాదవ్, నర్రా భిక్షపతి, ఈర్ల దేవానంద్, దశరథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్టు
గూడెం మధుసూదన్రెడ్డి అరెస్టయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్చెరు శాంతినగర్లోని మధుసూదన్రెడ్డి నివాసాన్ని పోలీసు దిగ్బంధించి అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. లక్డారంలో ఎమ్మెల్యే కుటుంబసభ్యుల నిర్వహణలోని క్రషర్లలో కేటాయింపులకు మించి క్రషింగ్ జరిగిందని ఆరోపిస్తూ కేసు నమోదైంది. ఆయనను సంగారెడ్డి కోర్టుకు తరలిస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. సంగారెడ్డిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు.