రేవంత్.. నిన్ను గద్దె దించుతమని అన్నదెవరు? దించుడు నీకు, నీ గురువు చంద్రబాబుకి అలవాటు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికింది నువ్వు. అడ్డదారిలో నడవటం నీకు, నీ గురువుకు అలవాటు. మాకు ఆ ఆలోచన లేదు. మేం ప్రజలను నమ్ముకుంటం. చిల్లర చేష్టలు మాకు అవసరం లేదు. గిట్లనే హామీలు నెరవేర్చకపోతే 5 ఏండ్ల తర్వాత జనమే నిన్ను దించుతరు.
– హరీశ్రావు
సిద్దిపేట, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలే రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని, గెలిచిన తర్వాత ఏమి చేశారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై అంతటా చర్చ మొదలైందని చెప్పారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలపై సిద్దిపేటలో జరిగిన సన్నాహక సమావేశంలో, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, మూడు నెలల కాంగ్రెస్ పాలనలో హామీల అమలుపై శ్రద్ధ చూపటం లేదని ఆరోపించారు. రైతులు సమస్యలతో అల్లాడుతున్నారని, పొలాలకు నీరందక పరేషాన్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది? వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు 13 హామీలు ఎకడ పోయాయి? మా అకచెల్లెళ్లకు ఇస్తానన్న రూ.2,500 ఎకడపోయాయి? మా అవ్వాతాతలకు ఇచ్చే రూ.4 వేల పెన్షన్ ఎకడ? రేవంత్ రెడ్డి’ అని నిలదీశారు. హామీలు ఎగ్గొట్టే కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన ఉండే, తెలంగాణ హక్కులపై నిరంతరం గళమెత్తే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు హరీశ్రావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉండాలని అన్నారు. ఎన్నడైనా జై తెలంగాణ అన్న ముఖమా? అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తాను 4 నెలలు జైల్లో ఉన్నానని అన్నారు. ‘తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్. ఈ పార్టీని లేకుండా చేద్దామనుకుంటున్నరు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎంకే సామాజిక న్యాయం లేదు
కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం సాక్షాత్తు ఆ పార్టీ ఉపముఖ్యమంత్రికే దొరకటం లేదని, ఇక సామాన్యుడికి ఏం దొరుకుతుందని హరీశ్రావు విమర్శించారు. ‘కాంగ్రెస్ పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలే రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారు. అసలు వీళ్లు ఏం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై అంతటా చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. బీజేపీ తెలంగాణకు ఏ ఒక్క జాతీయ ప్రాజెక్టు, ఒక్క మెడికల్ కళాశాల, నవోదయ విద్యాలయం ఇవ్వలేదు’ అని వెల్లడించారు. పార్లమెంట్లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదని హరీశ్ ఎద్దేవా చేశారు.
బజారు మనుషులు కూడా అలా మాట్లాడరు
రేవంత్రెడ్డి మాట్లాడే భాష.. బజారు భాష కంటే హీనంగా ఉన్నదని హరీశ్ మండిపడ్డారు. ఒక సీఎంలా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడరని, సీఎం పదవిని దిగజార్చేలా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘మొన్న మోదీ వస్తే సాష్ఠాంగ నమసారం పెట్టిండు. బడే భాయి అంటుండు. ఏడికెల్లి వచ్చిండు బడేభాయ్. బడేభాయ్, చోటాభాయ్ ఒక్కటైండ్రు. బీజేపీతో కుమ్మకయిండు’ అని ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డలో రెండు పిల్లర్లు దెబ్బతింటే బాగు చేయటం చేతకాక కేసీఆర్ను తిడతావా? మీ పాలనలో కడెం వాగు, పాలెం వాగు కొట్టుకుపోలేదా? దేవాదుల పైపులు పగల్లేదా? సిగ్గులేకుండా మాయమాటలు చెప్పి ఎన్నేండ్లు బతుకుతవ్? యాసంగి వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడుగు’ అని రేవంత్కు సవాల్ విసిరారు.
ఎరుకలకు గవర్నర్ అన్యాయం
ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణను కేసీఆర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని, కానీ.. గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా ఎరుకల వర్గానికి అన్యాయం చేశారని హరీశ్రావు విమర్శించారు. మంత్రిమండలి తీర్మానం చేసి పంపినదాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్కు లేదని తెలిపారు.
శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ పోరాటం
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉన్నదని హరీశ్ అన్నారు. శివాజీ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా జీవించేవని, మత సామరస్యానికి శివాజీ ప్రతీక అని చెప్పారు. ఆయన ఏ ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన సైన్యంలో కీలక స్థానాల్లో ముస్లింలు కూడా పని చేశారని గుర్తుచేశారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణను సాధించారని, శివాజీ బాటలో పదేండ్లు అద్భుతంగా పాలించారని పేర్కొన్నారు.
పంచాయతీ కార్మికులకు వేతనాలివ్వాలి: హరీశ్రావు ట్వీట్
హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 60 వేలకుపై ఉద్యోగులు, కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. వీరికి నెలల పాటు జీతాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ఎక్స్ వేదికగా వివరించారు. పేద వర్గాలకు చెందిన ఈ కార్మికుల కష్టాలను అర్థం చేసుకొని, వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రేవంత్.. నువ్వు బోనస్ ఎగ్గొట్టినవ్, రైతు రుణమాఫీ ఎగ్గొట్టినవ్, 15 వేల రైతుబంధు ఎగ్గొట్టినవ్, తులం బంగారం ఎగ్గొట్టినవ్. ఇంకా సిగ్గులేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నవ్? నోరు పెంచుకోవటం కాదు.విజ్ఞతతో పాలన చెయ్యు.
– హరీశ్రావు