హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం, హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కాంగ్రెస్ మాత్రం తెలంగాణ ప్రజలను తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అబద్ధాలే ఆధారంగా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించారు. ఏడాదిన్నర పాలనలో కనీసం ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేని, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ సాధించిన సాగునీటి విజయాలను తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గర ఫొటోలకు పోజులిచ్చి, అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు ఇవ్వడం మా తపన, ఫోటోలకు పోజులివ్వడం మీ ఘనతని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిన తెలంగాణ నేలని బీఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలం చేశామన్నారు.
‘నిజం మౌనంగా ఉంటే, అబద్ధమే రాజ్యం ఏలుతుంది’. ఈ సామెత కాంగ్రెస్ పార్టీ తీరుకు అతికినట్టు సరిపోతుంది. అబద్ధాలే ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. నిజం మౌనంగా ఉంటే, అసత్యమే నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది కనుక కాంగ్రెస్ చెబుతున్న ప్రతి అబద్ధానికి ఆధారాలతో సహా నిజాన్ని ప్రజల ముందుంచడం మా బాధ్యతగా భావిస్తున్నాము.
2018 ఆక్టోబర్ 30 న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి అందజేసింది. 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 113.795 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టు కు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం నిర్ధారించింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 70.4 టీఎంసీల నీటిని వినియోగించి 6.74 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఇవ్వవచ్చని, తాగునీరుతోపాటు పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం 2021లోనే నిర్ధారించింది. ఇంత స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్, హైడ్రాలజీ అనుమతులు ఉన్న సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని మాట్లాడడం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు పరాకాష్ట.
ఒక్క ఎకరాకు నీళ్లివ్వలే..
రాష్ట్ర ప్రయోజనాలను తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. కృష్ణా నదిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆంధ్ర పాలకులు గోదావరిలో నీటి దోపిడీకి పాల్పడుతుంటే, అడ్డుకునే సత్తా కాంగ్రెస్కు లేదు. ఏడాదిన్నర పాలనలో కనీసం ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేని, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ సాధించిన సాగునీటి విజయాలను తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని అప్పనంగా కిందకు వదులుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ కి తాకట్టు పెడుతున్నారు.
‘అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుంది’ అనే భ్రమలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చేసిన అన్యాయాలు మరిచిపోయారా? రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం కలిగించి ఆంధ్రాకు లాభం చేకూర్చేలా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా?. ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ హెడ్ వర్క్ ఆంధ్రాలో పెట్టి, శాశ్వతంగా తాళం వేసింది మీరే కదా. రాజీవ్ సాగర్ పైప్లైన్ కిన్నెరసాని వన్యప్రాణి కేంద్రం గుండా వేసి, అనుమతులు రాకుండా చేసింది మీరే కదా?.
కాంగ్రెస్ చేతగానితనంతో..
కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చింది. రైతులను ఆదుకునేందుకు గోదావరి జలాలే ఏకైక మార్గమని ముందుగానే గ్రహించిన కేసీఆర్ గారు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. మీరు సృష్టించిన అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ అనుమతుల ఇబ్బందులను అధిగమించేందుకు, కేసీఆర్ గారు సమీకృత సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల్లో ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాల ఆయకట్టతో పాటు, అదనంగా మరో 3.41 లక్షల ఎకరాలకు నీరందించి, నిల్వ సామర్థ్యాన్ని 1.2 టీఎంసీ నుంచి 10 టీఎంసీలకు పెంచి, 7,967 కోట్లతో పనులు ప్రారంభించారు.
ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తుంటే, రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో మీరే చేపట్టిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్తో పోలిస్తే సమీకృత సీతారామ ప్రాజెక్టులో నీటి కేటాయింపు 33 టీఎంసీ నుంచి 70.40 టీఎంసీకి పెరిగింది. పైప్లైన్ పొడవు 77 కిలోమీటర్ల నుంచి 8.56 కి.మీ.కు తగ్గింది. ఆయకట్టు 3.33 లక్షల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెరిగింది. అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ అనుమతుల సమస్యలు లేవు.
అటువంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలే నాడు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి, పనులు నిలిపివేశారు. పర్యావరణ అనుమతులు రావడానికి కూడా అడ్డుపడ్డారు. కేంద్రం ఆటంకాలు, కాంగ్రెస్ కుట్రలను ఛేదించి 90 శాతం పనులను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ‘అనుమతులు లేవు’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యమే. టీఏసీ (TAC) తప్ప అన్ని అనుమతులు పూర్తి చేశాం. అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తున్నాం.
ఫొటోలకు పోజులివ్వడం మీ ఘనత..
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గర ఫొటోలకు పోజులిచ్చి, అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు ఇవ్వడం మా తపన, ఫొటోలకు పోజులివ్వడం మీ ఘనత. మీ పాలనలో ఎడారిగా మారిన తెలంగాణ నేలని మా పాలనలో సస్యశ్యామలం చేశాం. సాగునీటిలో తెలంగాణకు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన చేసిన అన్యాయం తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సాగునీటి రంగంలో విజయ బావుటా ఎగురవేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో ధనదాహంతో కళ్లు మూసుకుని తెలంగాణ రైతులను అన్యాయం చేశారని, ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రతీ అంశంపై బీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తి పోయడం కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను ఇప్పటికైనా చిత్తశుద్ధితో పూర్తి చేయాలని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతున్నా.’ అని హరీశ్ రావ్ ట్వీట్ చేశారు.
“When truth stays silent, lies wear the crown.”
“నిజం మౌనంగా ఉంటే, అబద్ధమే రాజ్యం ఏలుతుంది.”
ఈ సామెత కాంగ్రెస్ పార్టీ తీరుకు అతికినట్టు సరిపోతుంది .అబద్ధాలే ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.… pic.twitter.com/ktkSo8ppeh
— Harish Rao Thanneeru (@BRSHarish) May 11, 2025
@BRSparty ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గర ఫోటోలకు పోజులిచ్చి, అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు ఇవ్వడం మా తపన, ఫోటోలకు పోజులివ్వడం మీ ఘనత !
మీ పాలనలో ఎడారిగా మారిన తెలంగాణ నేలని మా పాలనలో సస్యశ్యామలం చేశాం.
సాగునీటిలో తెలంగాణకు 50…
— Harish Rao Thanneeru (@BRSHarish) May 11, 2025