వరంగల్: కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ని హరీశ్ రావు సందర్శించారు. పత్తి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
సీసీఐ తుగ్లక్ వంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నది. ఎల్1, ఎల్2, ఎల్3 విధానం, కపాస్ యాప్లో 8 నుంచి 12 శాతం తేమ ఉండాలనే నిర్ణయాలతో రైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజులుగా మూతపడ్డాయి. పత్తి రైతులంతా అయోమయంలో ఉన్నారు. ఈరోజు రైతులకు పత్తిని అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తికి మద్దతు ధర రూ. 8,100. కానీ, రూ.6 వేలకే రైతులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. క్వింటాల్ మీద రూ.2000ల చొప్పున పత్తి రైతులు నష్టపోతున్నారు. మాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం చూపించి, చేతల్లో నరకం చూపిస్తున్నాయి.
వరదలు, తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే తుగ్లక్ నిర్ణయాలతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదు. 60 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రికి పత్తి రైతుల గురించి కేంద్రానికి విన్నవించే అవకాశం రాలేదా?. పత్తి రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పే ఓపిక లేదా? సమయం లేదా?. రేవంత్ రెడ్డికి బడేభాయితో మంచి సంబంధాలే ఉన్నాయి కదా. ఎందుకని పత్తి రైతుల గురించి బడే భాయికి చెప్పడం లేదు. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్ రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. పంట చేనులన్నీ దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎల్ వన్, ఎల్ టు, ఎల్ త్రీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 8 నుంచి 12 శాతం తేమ విధానాన్ని సవరించి, కపాస్ యాప్ ని రద్దు చేయండి. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల కపాస్ యాప్లో నమోదు చేయడం రైతులకు కష్టమైన పని. గత సంవత్సరం లాగానే 12 క్వింటాల పత్తి కొనాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేస్తున్నారు?. పంట పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు బీజేపీ ఎంపీల కంటే నయం. అవి పంట పొలాల్లో కోతులు, పక్షులు రాకుండా కనీసం పనిచేస్తాయి. బీజేపీ ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పరు. రైతుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కేసీఆర్ని, బీఆర్ఎస్ని తిట్టడం తప్ప బీజేపీ ఎంపీలకు మరో పని చాతకాదు. కాంగ్రెస్ ప్రశ్నించదు. బీజేపీ అడగదు. బడా బడా పారిశ్రామికవేత్తలకు బీజేపీ లక్ష కోట్లు మాఫీ చేసింది. మరి పేద రైతులకు ఎందుకు మేలు చేయరు?. విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే నిబంధనలు సవరించి 11శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని రద్దుచేసి విచ్చలవిడిగా పత్తిని తెస్తున్నారు. కనీస మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఏమైనా అడుగుతే మోదీ ప్రభుత్వం విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటుంది అని సమాధానం చెబుతున్నారు. రైతుకు మేలు చేసేది ఉంటేనే నిబంధనలు పెడతారా?. దళారుల కోసం, బడా బాబుల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులపై లాఠీచార్జులు పెరిగాయి. రెండేళ్ల పాలనా విజయోత్సవాలు ఎందుకు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి?. రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా?. యూరియా బస్తాల కోసం రైతులను లైన్లో నిల్చోపెట్టినందుకు విజయోత్సవాలా?. ములుగు నియోజకవర్గంలో చింతకుంట, మంగపేట మండలాల నుంచి వచ్చిన రైతు వెంకటేశ్వర్లు, రైతు లక్ష్మయ్య మక్కలు అమ్మడానికి ఎనుమాముల మార్కెట్కి వచ్చారు. క్వింటల్ మక్కలు రూ.1800 కు రైతులు అమ్ముతున్నారు, రూ.2400 మక్కకు మద్దతు ధర. మక్క రైతులు ఒక క్వింటాలకు రూ.570 నష్టపోతున్నారు. ఎవరికైనా మక్క రైతులకు పైసలు విడుదల చేశారా అని మార్క్ ఫెడ్ అధికారులను అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా విడుదల చేయలేదని సమాధానం ఇచ్చారు. పోయిన యాసంగిలో రైతులకు రావలసిన రూ.1,100 కోట్ల బోనస్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం ఈ సంవత్సరం కొన్న రైతులకు కూడా రూ.1,400 కోట్ల బకాయిలు పడ్డాయి. పంటల భీమా తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు అయినా పంటల బీమాను రైతులకు అందించడంలో విఫలమైంది. పంటల బీమా ఉండి ఉంటే నష్టపోయిన పంటకు రైతులకు నష్టపరిహారాలు అందేది కదా. బోనస్ ఎగ్గొడివితి. రైతుబంధు రెండు పంటలకు ఎగబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే. కరెంటు లోవోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కాంటాకు వస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక, తెరిచినా కొనక దళారుల పాలైతున్నది ధాన్యం. ఎరువులందవు. విత్తనాలు అందవు. కరెంటు సరిగ్గా రాదు. రైతుబంధు రాదు. రుణమాఫీ జరగదు. బోనస్ ఎగ బెడతావు. పంటల బీమా లేదు. ఇంతే కదా రేవంత్ రెడ్డి. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా?.
దిగుమతి సుంకాలు ఎత్తివేసి రైతులపై ఆంక్షలు పెట్టడం బీజేపీ పద్ధతి. పత్తి, పామాయిల్ దిగుమతులపై సుంకం ఎత్తేసి ఎవరికి లాభం చేస్తున్నారు? ఎందుకు రైతుల మెడకు ఉరితాడు వేస్తున్నారు?. బడా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు రైతులను అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఉత్తర భారత దేశంలో పండే గోధుమలకు ఒక నీతి దక్షిణ భారతదేశంలో పండే వడ్లకొక నీతి పెట్టింది. దేశంలో మొట్టమొదటిసారి రైతులు ఉన్నా రైతుబంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తం. జూబ్లీహిల్స్ ప్యాలస్ ని ముట్టడిస్తాం. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసి నిబంధనలు ఎత్తివేసి పత్తికొనే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. వరంగల్ వరదల్లో 20 వేల ఇండ్లు మునిగిపోయాయి. సకాలంలో గేట్లు ఎత్తి ఉంటే వరంగల్ నగరం ముగిపోయేది కాదు. మునిగిపోయిన ఇళ్లకు రూ. 15 వేలు ఇస్తామన్నారు. రెండు నెలలు అయింది ఒక రూపాయి ఇవ్వలేదు. వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.