Harish Rao | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, 13 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలుచేసి చూపిస్తే ఇప్పటికీ తాను రాజీనామా సవాల్కు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి టీ హరీశ్రావు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది రేవంత్రెడ్డి అని దుయ్యబట్టారు.
‘కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, పారిపోయింది మీరే’ అంటూ రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గురువారం ఎక్స్ వేదికగా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ‘నిరంతరంగా పారిపోయిన చరిత్ర మీది, నిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది’ అని పేర్కొన్నారు.
‘మీరు పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చుంటే, నేను మంత్రి, ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన. నాకు పదవులు, రాజీనామాలు కొత్తకాదు, ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుందంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేసేందుకైనా వెనుకాడను’ అని స్పష్టం చేశారు. ‘మరోసారి చెబుతున్నా.. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13 హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు..‘నేను రాజీనామాకు సిద్ధం, అమలు చేయని పక్షంలో నువ్వు సిద్ధమా?’ అంటూ రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు.