Harish Rao | హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కరెంట్ కోతలు మొదలయ్యాయని రైతులు ఆవేదన చెందారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మున్నూరు కాపు సంఘం నేతలు తెలంగాణ భవన్లో హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మీ వినతిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తాము. కేసీఆర్ ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి. మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో మందికి అవకాశం కల్పించారని హరీశ్రావు గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో 13 హామీలు అన్నారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ అన్నారు. ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదని విమర్మించారు హరీశ్ రావు. బోనస్ విషయంలో దగా, రుణమాఫీ విషయంలో దగా, ఉచిత కరెంట్ విషయంలో దగా, రైతు బంధు విషయంలో దగా.. కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లు ఉంది. చెప్పుకుంటూ పోతే మొత్తం 420 దగాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం కరెంట్ ఇస్తోంది. ఎన్నికలు అయిపోతే కరెంట్ కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయని హరీశ్ రావు అన్నారు.
మోదీని బడే భాయ్ అని, ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని రేవంత్ అన్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అని రేవంత్ చెప్పకనే చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే పోయేదేమీ లేదు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పోరాటంతోనే సాధ్యం అవుతుందన్నారు. రుణమాఫీ, రైతు బంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చురక పెట్టాలన్నారు హరీశ్రావు.
బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ ఓడిపోతేనే.. కాంగ్రెస్ హామీలు అమలు అవుతాయన్నారు. మార్చి నెలాఖరుకు ఎండలు ముదిరితే పంట సాగు ఎలా అని రైతులు ఆందోళన పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. రెండు సార్లు గేలిపిస్తే పార్టీకి మోసం చేశారు బీబీ పాటిల్. వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు హరీశ్ రావు.