డిఫ్లెక్షన్, డైవర్షన్, డిస్టార్షన్, డిస్ట్రక్షన్ అంతిమంగా రిగ్రేషన్. అనే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఉన్నది. అంటే ప్రతిపక్షం మీద దాడి చేయడం, ప్రజల దృష్టిని మళ్లించడం, వాస్తవాలను వక్రీకరించడం, నిర్లక్ష్యంతో జాతీయ సంపదను విధ్వంసం చేయడమే. మొత్తంగా తిరోగమన దిశలో ప్రభుత్వం పయనిస్తున్నది.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
Harish Rao | వరంగల్, మార్చి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ): మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల మేడిగడ్డ బరాజ్కు మరింత నష్టం జరిగితే అందుకు రేవంత్రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. వానకాలం వచ్చేలోగా మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేసి, రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు అని, దానిని కాలరాసే విషపు కుట్రలను మానుకోవాలని హితవు చెప్పారు. చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా అన్నారం బరాజ్ వద్ద నిర్వహించిన ప్రెస్మీట్, ఫైనల్ పవర్పాయింట్ ప్రజెంటేషన్లో హరీశ్రావు మాట్లాడుతూ.. మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. మమ్మల్ని ఎంతైనా హింసించండి కానీ మేడిగడ్డ ప్రాజెక్టును ధ్వంసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు తాము చలో మేడిగడ్డకు పిలుపునిస్తే, దాని నుంచి ప్రజలను, మీడియాను డైవర్ట్ చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. ఇలాంటి చిల్లర రాజకీయాలతో రాష్ర్టాన్ని అధోగతి పాలు చేయబోతున్నారనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు పొందాలనే దుగ్ద తప్ప నీళ్లిద్దామనే ఆలోచన లేదని విమర్శించారు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగి మూడు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ప్రాజెక్టు పునరుద్ధరణపైన నిర్మాణాత్మకమైన వైఖరిని వెల్లడించలేదని మండిపడ్డారు. ఒకవైపు మేడిగడ్డను సేఫ్జోన్కు తెచ్చేందుకు పునరుద్ధరణ పనులు చేస్తూనే, మరోవైపు అన్నారం నుంచి కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు అందించడం సాధ్యమవుతుందని సూచించరు. ప్రాజెక్టులో తలెత్తిన లోపాన్ని సరిదిద్దకుండా, ఆ సాకుతో తెలంగాణ రైతుల ప్రయోజనాలను, తెలంగాణ వ్యవసాయ ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపటనాటకం తెలంగాణ రైతాంగం పాలిట పెనుశాపంగా మారబోతున్నదని హెచ్చరించారు.
మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సాకుగా చూపించి, యావత్ కాళేశ్వరాన్ని విధ్వంసం చేసే కుట్రకు పాల్పడుతున్నదనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తున్నదని చెప్పారు. బాంబులు పెట్టి ప్రగతిభవన్ పడగొడుతానని గతంలో రేవంత్రెడ్డి ప్రకటన చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ను రాజకీయ క్షేత్రంలో పడగొట్టడం కోసం కాళేశ్వరాన్ని పడగొట్టాలనే ధ్వంసరచన సీఎం నేతృత్వంలో జరుగుతున్నదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చెత్త ప్రాజెక్టుగా పేర్కొనడం, ఇంజినీర్లను అవమానించడమేనని, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయడేమనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే 16 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీళ్లు అందుతాయని, కాళేశ్వరం ద్వారా 38 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని వివరించారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఆయకట్టును డబుల్ చేసినందుకు క్షమాపణ చెప్పాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడేండ్లు వృథా చేస్తే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాలుగేండ్లలో కాళేశ్వరం పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించిందని వివరించారు. రైతన్న కష్టాలు, కడగండ్లు తొలగించేందుకు యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు అందించామని స్పష్టంచేశారు. కాళేశ్వరం ద్వారా మొత్తంగా 20,33,572 ఎకరాలకు నీరు అందించామని, ఈ ప్రాజెక్టు ద్వారా సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి, మత్స్య సంప ద, భూగర్భ జలాలు పెరిగిందని ఆయన వివరించారు.