రేవంత్.. నీకు దమ్ముంటే, రైతుల మీద నీకు నిజంగా ప్రేముంటే, నీది నిజమైన ప్రజాపాలనే అయితే సంపూర్ణ రుణమాఫీ చెయ్యి. వరంగల్ డిక్లరేషన్ను పూర్తిగా తప్పకుండా అమలు చెయ్యి. అప్పుడు రైతు పండుగ చేసుకో! అప్పుడు నీ పాలన విజయోత్సవాలు జరుపుకో! నీ ఏడాది పాలనంతా పైన పటారం లోన లొటారం. మొత్తం డంబాచారం. ఈ ఏడాది పాలన ఓ పెద్ద ఫెయిల్యూర్
– హరీశ్రావు
Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన అన్నిరంగాల్లో ఫెయిల్ అయిందని, ఈ సరారు ఉత్త బేకార్గా ఉన్నదని ప్రజలే అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎవరూ మెచ్చుకునే పరిస్థితి లేకనే ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నారని, తమది సుపరిపాలన అని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవాచేశారు. ‘నీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలె. నువ్వు కాదు రేవంత్రెడ్డీ.. నీ అపరిపక్వత, నీ అసమర్థత, నీ ప్రతికూల వైఖరి వల్ల రాష్ట్రంలో నేడు అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నది’ అని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
‘మేము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ర్టాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా నీకు లేదు. సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికొచ్చినట్టు వాగుతున్నవు. నెపం ప్రతిపక్షం మీదికి నెట్టుతున్నవు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు నీ మాటలున్నయి. ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తశుద్ధి లేదు. ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ము లేదు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా’ అంటూ నిప్పులు చెరిగారు.
మా హయాంలో మొత్తం 11 విడతల్లో 72,815 కోట్ల రైతుబంధు ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్. ఆరు నూరైనా రైతుబంధు ఆపని కేసీఆర్ ఎక్కడ? ఏడాదిలోనే చేతులెత్తేసిన నువ్వెక్కడ? కేసీఆర్ పేరు ఉచ్ఛరించే నైతికత కూడా నీకు లేదు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం 7,200 కోట్లు సిద్ధం చేసి ఖాతాల్లో వేసేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్నం. రైతుల ఖాతాల్లో రైతుబంధు పడితే నీ డబ్బాలో ఎక్కడ ఓట్లు పడవోనన్న భయంతో దుర్మార్గంగా ఈసీకి ఫిర్యాదు చేసి ఆపింది నువ్వు.
-హరీశ్రావు
ఏడు లక్షల కోట్ల అప్పు అని ఏడాది నుంచి చెప్పిన అబద్ధమే రేవంత్రెడ్డి చెప్తున్నాడని, గోబెల్స్ను మించిన రేబెల్స్ ప్రచారం చేస్తున్నాడని హరీశ్రావు మండిపడ్డారు. అప్పులు బహిరంగ రహస్యమేనని, గణాంకాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంటాయని, అసెంబ్లీలో ఏటా ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లో ఉంటాయని చెప్పారు. ఆనాడు సీఎల్పీ లీడర్గా ఉన్న భట్టి విక్రమారకు రాష్ట్ర అప్పులు, ఆదాయం తెలియదా అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 4,26,499 కోట్లు అని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఏ చానల్ వేదికగా కూర్చుందామో, ఏ ఆర్థిక నిపుణులతో కూర్చుందామో చెప్పాలని రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు.
ఏడు లక్షల కోట్ల అప్పు అని ఏడాది నుంచి చెప్పిన అబద్ధమే మళ్లీ మళ్లీ చెప్తున్నవ్. గత ప్రభుత్వం దాచిపెట్టిందని అసత్య ప్రచారం చేస్తున్నవ్.. ప్రభుత్వం అట్ల దాచే అవకాశమే ఉండదు రేవంత్రెడ్డీ.. అప్పులు బహిరంగ రహస్యమే. గణాంకాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంటయి. ఏటా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లో ఉంటయి. ఆనాడు సీఎల్పీ లీడర్గా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర అప్పులు ఎంతో? ఆదాయం ఎంతో తెలియదా?
-హరీశ్రావు
అబద్ధానికి అంగీ లాగు వేస్తే అచ్చం రేవంత్రెడ్డి లెకనే ఉంటదని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్రావు ఎద్దేవాచేశారు. ‘మీ పేరే ఎగవేతల రేవంత్రెడ్డి. రైతు బంధును ఎవరు ఎగ్గొట్టారో ప్రజలకు తెల్వదా? ప్రజల విజ్ఞత మీద నీకు చాలా తకువ అభిప్రాయం ఉన్నది. మోసం చేసుడు నీకు అలవాటు, మోస పోవుడు ప్రజలకు అలవాటు అనే కదా నీ నమ్మకం. ‘ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం 7,200 కోట్ల నిధులు సిద్ధం చేసి రైతుల ఖాతాల్లో వేసేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుంటే.. రైతుల నోటికాడికి వచ్చిన బుకను ఎత్తగొట్టిన పాపాత్ముడివి నువ్వు.. ఇప్పుడైతే 10 వేలు, మేమొస్తే 15 వేలు అని రైతులను నమ్మించి ఓట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడివి నువ్వు. పార్లమెంట్ ఎన్నికల ముందు మేము నిలదీస్తే విధిలేక మేము సిద్ధం చేసిన నిధులతో రైతుల ఖాతాల్లో 5 వేలే వేసినవు. 7500 ఎందుకు వేయలేదు? నిజాయతీ ఉంటే సమాధానం చెప్పు. మొన్న వానకాలం పూర్తిగ ఎగ్గొట్టినవు. రైతుబంధు ఆపింది నువ్వు.. లేని ఆశలు రేపింది నువ్వు.. తీరా అధికారంలోకి వచ్చి ఎగ్గొట్టింది నువ్వు’ అంటూ హరీశ్ నిప్పులు చెరిగారు.
నీకు దమ్ముంటే.. రైతుల మీద నీకు నిజంగా ప్రేముంటే.. నీది నిజమైన ప్రజాపాలనే అయితే.. సంపూర్ణ రుణమాఫీ, వరంగల్ డిక్లరేషన్ను తు.చ తప్పకుండా అమలు చెయ్యి. అప్పుడు చెయ్యి రైతు పండుగను. అప్పుడు చేసుకో నీ పరిపాలన విజయోత్సవాలు. నీ ఏడాది పాలన అంతా పైన పటారం లోన లొటారం.. అంతా డంబాచారం.
– హరీశ్రావు
నాడు బీఆర్ఎస్ పాలనలో వరుసగా రెండేండ్లు కొవిడ్ మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనా కేసీఆర్ రైతు బంధును ఒక్కసారి కూడా ఆపలేదని హరీశ్రావు గుర్తుచేశారు. మొత్తం 11 విడతల్లో రూ.72,815 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసిన రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. ‘ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15 వేలు ఇస్తామని చెప్పిన విషయం నీకు గుర్తులేకపోవచ్చు రేవంత్రెడ్డీ.. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి’ అని చురకలంటించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 4,26,499 కోట్లు అని అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా నిరూపించిన.ఇప్పటికీ అదే సవాల్ చేస్తున్న. నా వాదనలో సత్యం ఉన్నది. సత్యాన్ని ఎదుర్కొనే శక్తి నీకు, నీ ఆర్థిక మంత్రికి లేదు. తోచిన అబద్ధమల్లా చెప్పి ప్రజలను తొవ్వ తప్పిద్దామనే తొండి బుద్ధి మీది. ఏ చానల్ వేదికగా కూర్చుందామో, ఏ ఆర్థిక నిపుణులతో కూర్చుందామో? చెప్పు. తప్పించుకోకు.
-హరీశ్రావు