కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది: 3.65 లక్షల కోట్లు
కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చింది: 1.96 లక్షల కోట్లే!
మరి ఎవరు ఎవరి ఫొటో పెట్టుకోవాలి?
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలవుతున్నదని ఈ ఏడాది ఫిబ్రవరి 4న పార్లమెంట్లో సాక్షాత్తూ కేంద్ర వైద్య శాఖ మంత్రే ప్రకటించారు. అదే ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి మాత్రం ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇందులో ఏ మంత్రి ప్రకటన నిజం? ఆయుష్మాన్ భారత్ కింద 2021-22లో తెలంగాణకు కేంద్రం రూ.150 కోట్లు విడుదల చేస్తే.. రాష్ట్రం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.858.99 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే కేంద్రం నిధులు ఎందుకు ఇచ్చింది? ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. లేదంటే మీరు రాజీనామా చేస్తారా? – మంత్రి హరీశ్
ప్రపంచ ఆకలి సూచీలో 2014కు ముందు భారత్ స్థానం 55. ప్రస్తుతం 101
ఎనిమిదేండ్ల క్రితం దేశంలో నిరుద్యోగిత 4.9 శాతం. ఇప్పుడది 11 శాతం
సగటు పౌరుడి తలసరి ఆదాయంలో మనదేశానిది ప్రపంచంలోనే 144 స్థానం
రూపాయి విలువ పాతాళానికి పతనం.
2014లో డాలర్కు విలువ రూ.63.. ఇవాళ రూ.83..
ఇప్పటికే జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది.
అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అంచనా ప్రకారం.. ఈ ఏడాది భారత్ జీడీపీ వృద్ధిరేటు 7.7 శాతం మాత్రమే.
మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నది. ఈ దశలో దేశ ఆర్థికమంత్రి ఏం చేయాలి? ఆర్థిక నిపుణులతో చర్చలు జరపాలి. ఎకానమీని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలి. కానీ దేశ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఏం చేస్తున్నారు? వాటన్నింటినీ గాలికొదిలి.. మూడురోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మకాం వేశారు.
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోనంబరు రేషన్ పంపిణీ దుకాణాన్ని శుక్రవారం బీజేపీ శ్రేణులు వెంటరాగా కేంద్రమంత్రి పరిశీలించారు. అడుగడుగునా అహంభావ ప్రదర్శన చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయాలని భావించిన నిర్మల తన హోదాను కూడా మరిచి చూపుడు వేలును చూపిస్తూ డీలర్ మొదలుకొని కలెక్టర్ దాకా బెదిరింపులకు, దబాయింపులకు దిగారు. తను ఈ దేశానికి ఆర్థిక మంత్రినని మరిచి వీధి రాజకీయానికి తెగబడ్డారు. తమకు రేషన్ బియ్యం సరిగానే అందుతున్నాయని మహిళ చెబుతున్నా వినిపించు కోకుండా.. లేదు లేదు నువ్వు భయపడుతున్నావు.. అందుకే నిజం చెప్పడంలే దంటూ ఆమెను హిప్నటైజ్ చేసినంత పని చేశారు. మీడియాపైనా చెలరేగిపోయారు.
రేషన్ షాపులో మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ కలెక్టర్తో వితండవాదనకు దిగారు. ఐఏఎస్ అధికారి అని కూడా చూడకుండా కలెక్టర్ వివరణకు దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు వచ్చి రేషన్ షాపులో మోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారని చెప్పిన కేంద్రమంత్రి.. ఆ ఫ్లెక్సీని తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్దేనంటూ బెదిరింపులకు దిగారు. ఇంతకీ నిర్మల కేంద్ర మంత్రి హోదాలో తనిఖీ చేశారా? లేక బీజేపీ నేతగానా?
మార్కెట్లో 30- 35 రూపాయలుగా పలుకుతున్న కేజీ బియ్యాన్ని కేంద్రం లబ్ధిదారులకు రూపాయికే ఇస్తున్నది. కేంద్రప్రభుత్వం దగ్గరదగ్గరగా రూ.30 ఇస్తున్నది. లేకపోతే రూ.28 అనుకోండి. లబ్ధిదారుడి వాటా కేజీకి ఒక్క రూపాయి. అంటే మిగిలినదే స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నది. గోధుమలు, కందిపప్పు కూడా ఇస్తున్నాం. ప్రజల కోసం కేంద్రప్రభుత్వం చేస్తున్న కార్యక్రమమిది. ఇందులో రాష్ట్రప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎక్కడుంది?
– నిర్మలా సీతారామన్
దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ పేదల కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. వారి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 10 ఏండ్ల నుంచి రూ.2కే కిలో గోధుమలు, రూ.3కే కిలో బియ్యం అందిస్తున్నాం. కానీ, ఈ రోజు భారత ప్రభుత్వం ఆ ఘనతను తన ఖాతాలో వేసుకొంటున్నది. పేదల పొట్టమీద రాజకీయాలు చేస్తున్నది. దేశంలో పేదలకు ఉపాధి, కడుపు నిండా తిండి రాష్ర్టాల వల్లనే దక్కుతున్నది. ఎన్నో ఏండ్ల నుంచి రాష్ర్టాలు తమ సొంత నిధులతో రాయితీలు ఇవ్వడం వల్లే అది సాధ్యమైంది. దానిపై రాజకీయాలు చేయడం కేంద్రానికి తగదు. రేషన్ బియ్యం పంపిణీకి మేమే డబ్బు ఇస్తున్నామని కేంద్రం ప్రచారం చేసుకొంటున్నది. ఆ డబ్బులేమైనా వాళ్ల మామ ఇంట్లో నుంచి ఇస్తున్నారా?
– గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మోదీ రేషన్ బియ్యంపై చేసిన వ్యాఖ్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వచ్చి, పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టీ హరీశ్రావు కడిగి పారేశారు. నిర్మల చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ ఒక్కోదానికి తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరలేదని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే మీరు రాజీనామా చేస్తారా? అని సూటిగా సవాలు విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టిచ్చినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యం విషయంలోనూ సగం ఖర్చు రాష్ర్టానిదేనని తేల్చి చెప్పారు. శుక్రవారం తూప్రాన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రిగా ఉంటూ.. ప్రధాని ఫొటోను రేషన్ షాపులో పెట్టాలని కోరడం.. కేంద్ర ప్రభుత్వ, ప్రధానమంత్రి పదవి స్థాయిని దిగజార్చటమేనని మండిపడ్డారు. దేశంలో బీజేపీదే మొదటి ప్రభుత్వం కాదని, ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత బీజేపీ మంత్రులు, నేతలు తమ స్థాయిని దిగజార్చుకునేలా ప్రవర్తిస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. మొత్తం బియ్యం వాళ్లే ఇచ్చినట్టు రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో పెట్టాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం మొత్తం రేషన్ కార్డులు ఇవ్వడంలేదు. 50-55 శాతం మంది పేదలకు కేంద్రం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఇస్తే.. మిగిలిన 40-45 శాతం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఇస్తున్నది. కేంద్రం ఇచ్చేది కూడా మొత్తం ఉచితంగా ఇవ్వటం లేదు. రూ. 3 కిలో చొప్పున కేంద్రం ఇస్తే.. ఇందులో రూ. 2 రాష్ట్రం భరిస్తున్నది. మిగిలిన కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును పూర్తిగా భరించి పేదలకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. కానీ నిర్మల సీతారామన్ మాత్రం మొత్తం బియ్యం కేంద్రమే ఢిల్లీ నుంచి పంపిస్తున్నట్టు చెప్తున్నారు. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.3,610 కోట్లు సొంతంగా ఖర్చు చేస్తున్నది. అలా అని మేము మా ముఖ్యమంత్రి బొమ్మను రేషన్ షాపుల్లో పెట్టుకోలేదు కదా’ అని అన్నారు.
కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫొటో పెట్టండి
రాజకీయాల కోసం దిగజారి మాట్లాడొద్దని, తమకు కూడా మాట్లాడటం వచ్చని బీజేపీ నేతలను మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ‘దేశాన్ని సాదే ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. దేశంలో చాలా పేద రాష్ర్టాలుంటాయి. కొన్ని దేశానికి సంపదను సృష్టించి ఇస్తే.. ఆ సంపదను పేద రాష్ర్టాలకు పంచుతారు. తెలంగాణ నుంచి కేంద్రానికి సుమారు రూ.1.75 లక్షల కోట్లు అదనంగా ఇచ్చాం. తెలంగాణ డబ్బుతో కేంద్ర ప్రభుత్వంతోపాటు, అనేక రాష్ర్టాలను సాకుతున్నాం. కేంద్రంలో, ఆ రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ ఫొటో కూడా పెట్టుకోండి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 3,65,797 కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చింది రూ.1,96,448 కోట్లు మాత్రమే. మరి సీఎం కేసీఆర్ ఫొటో మీరు ఎందుకు పెట్టరు?’ అని ప్రశ్నించారు.
రావడం.. అబద్ధాలు చెప్పడం
బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు మాట్లాడేవన్నీ అసత్యాలు, అర్ధసత్యాలని.. తాము చెప్పేవన్నీ నగ్న సత్యాలని మంత్రి హరీశ్రావు అన్నారు. తాము నిజాలు మాట్లాడుతుంటే.. బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణకు వచ్చి కాళేశ్వరంతో ఒక్క ఎకరం కూడా నీళ్లు పారలేదన్నారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అని.. తెలంగాణకు సాగు, తాగునీరు అందించి రాష్ట్రంలో అద్భుత ప్రగతిని సాధించిందని కితాబిచ్చారు. ఒకే ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇక మరో నేత నడ్డా వరంగల్కు వచ్చి జైలు కూలగొట్టిండ్రు.. హెల్త్సిటీ ఏదని మాట్లాడారు. వెంటనే తాను ఫొటోలు చూపితే ఒక్కరు కూడా కిక్కురుమనలేదు. ఇలా బీజేపీ జాతీయ నేతలంతా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ.. దివాలాకోరు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
కేంద్రం అప్పుల సంగతేంటి..?
తెలంగాణలో అప్పులు పెరిగాయన్న నిర్మలా సీతారామన్ ఆరోపణలను మంత్రి హరీశ్రావు తిప్పికొట్టారు. డెక్ టూ జీఎస్డీపీ రేషియాలో తెలంగాణది 23.5 శాతం మాత్రమేనని.. అదే పంజాబ్ 42, హిమాచల్ప్రదేశ్ 38, పశ్చిమ బెంగాల్ 36.9, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్ 36.6, గోవా 33.3, బీహార్ 32.6 శాతంతో ఉన్నాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చాలా తక్కువ అప్పులు చేసిందని సాక్షాత్తు ఆర్బీఐ కితాబిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రతి పౌరుడిపై 1.20 లక్షల అప్పు ఉన్నదని పచ్చి అబద్ధాలు చెప్పారని, కేంద్రం లెక్కల ప్రకారమే అప్పు రూ.89,188 అని వివరించారు. కేంద్రం చేసిన అప్పుల ప్రకారం ప్రతి పౌరుడిపై రూ.1.25 లక్షల అప్పు ఉన్నదని తెలిపారు. ‘కేంద్రం 57 శాతం అప్పులు తెచ్చుకొంటే ఒప్పు.. తెలంగాణ 23 శాతం అప్పులు తెచ్చుకొంటే తప్పా? ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు రూ.22,548 కోట్ల ఆర్థిక లోటులో ఉన్నది? కర్ణాటక రూ.19,338 కోట్ల లోటు బడ్జెట్తో ఎందుకు ఉన్నది? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు లోటులో ఉన్నది? తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పడంకన్నా ఘోరం మరొకటి లేదు. తెలంగాణలో 2014లో 898 మంది రైతులు చనిపోతే 2020లో 466 మంది చనిపోయారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు సగానికి తగ్గాయని పార్లమెంటులోనే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ చెప్పారు. ఆత్మహత్యలు పెరిగాయని ఇప్పుడు నిర్మలా సీతారామన్ కామారెడ్డి గల్లీలో అంటున్నారు. ఎవరి మాటలు నమ్మాలి’ అని ప్రశ్నించారు.
మా పథకాలను మీరే కాపీ కొట్టారు
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్న నిర్మల వ్యాఖ్యలపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘కేంద్రమే తెలంగాణ పథకాలను కాపీ కొట్టింది. రైతుబంధు కేంద్రం పెట్టిందా? రాష్ట్రం తెచ్చిందా? రైతుబీమాలో మీది ఒక్క రూపాయి అయినా ఉన్నదా? ఇందులో పేరు మార్చామా? 24 గంటల ఉచిత విద్యుత్తు పేరు మార్చామా? ఇలాంటి పథకం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నదా? మీకు చేతనైతే దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాలు అమలు చేయండి. మా పథకాల్లో కేంద్రం డబ్బులు ఉన్నాయన్న గోబెల్స్ ప్రచారం మానుకోండి. కేసీఆర్ కిట్లో, కల్యాణలక్ష్మిలో మీది పైసా అయినా ఉన్నదా? రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తున్నది మీరు కాదా..? మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ఘర్ జల్’ అని పథకం పెట్టింది కేంద్రం కాదా’ అని నిలదీశారు.
మాకు ఎక్కువ బియ్యం ఇస్తున్నది కేసీఆర్ సారే!
రేషన్ బియ్యం మొత్తం ప్రధానమంత్రి మోదీనే పంపిస్తున్నడని మంత్రి మేడమ్ చెప్పింది. కానీ బియ్యమంతా ప్రధానే పంపితే మా కేసీఆర్ బియ్యం ఎటుపోతున్నయ్? ఎప్పటినుంచో రూపాయికి కిలో బియ్యం ఇస్తున్న మా సీఎం సారు వద్దటగనీ, నిన్నగాక మొన్న 5 కిలోల బియ్యం ఇచ్చి.. మా మోదీ ఫొటో పెట్టుండ్రి అని చెప్పుడు మంచిగ లేదు. ఇంతకుమునుపు ఇంట్ల ఎంతమంది ఉన్నా.. 20 కిలోల బియ్యం కన్నా ఎక్కువ రాకుండె. ఇప్పుడు ఇంట్ల ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కళ్లకు 6 కిలోల బియ్యం సీఎం కేసీఆర్ సార్ ఇస్తున్నడు. మోదీ కన్నా మాకు బియ్యం ఎక్కువ ఇస్తున్నది మా కేసీఆర్ సారే.
– బొజ్జ లింగవ్వ, లబ్ధిదారు, బీర్కూర్ (కామారెడ్డి జిల్లా)