Harish Rao | తూప్రాన్లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య ఆధిపత్యం కోసం ప్రజలను బలి చేస్తున్నారని మండిపడ్డారు. మీకు ఆధిపత్య రాజకీయాలు కావాలా? లేక అభివృద్ధి కావాలా? ఆలోచించండని ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్లో హరీశ్రావు పర్యటించారు. ఈ సందర్భంగా అల్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు ప్రసంగించారు. అక్కడి నుంచి తూప్రాన్ బస్టాండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. తూప్రాన్ అభివృద్ధిని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు.
ఒకప్పుడు తూప్రాన్లో మంచినీళ్లు కావాలంటే మూడు రోజులకోసారి వచ్చేవని.. గీతారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిందెలతో అడ్డం పడి నిరసన తెలిపేవాళ్లు అని హరీశ్రావు గుర్తుచేశారు. కానీ కేసీఆర్ వచ్చాక ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఆడబిడ్డలకు నీటి కష్టాలను తీర్చారని తెలిపారు. తూప్రాన్ను మున్సిపాలిటీ చేసింది, ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, ఫోర్ లైన్ రోడ్లు వేసి హైవేలా మార్చింది కారు గుర్తు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాకముందు తూప్రాన్కు పిల్లనియ్యాలంటే నీళ్లు మోపిస్తారని భయపడేవాళ్లు.. కానీ ఇప్పుడు తూప్రాన్కే పిల్లనియ్యాలన్నట్టు పరిస్థితి మారిందని అన్నారు. పది లక్షలు లేని భూమిని కోటి రూపాయలు చేసింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి చేరాయని హరీశ్రావు అన్నారు.
రెండేళ్ల నుంచి తూప్రాన్ అభివృద్ధిని అడ్డుకున్నారని హరీశ్రావు తెలిపారు. రోడ్లకు గుంతలు పడితే డాంబర్ వేసే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట పంటకు రైతుబంధు పడేది. కరోనా కష్టకాలంలో కూడా ఆపలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి రెండు రైతుబంధులు ఎగ్గొట్టాడన్నారు. బతుకమ్మ చీరలు బంద్, కేసీఆర్ కిట్ బంద్, గొర్రెల పంపిణీ బంద్, చేప పిల్లలు బంద్, దళిత బంధు బంద్.. అన్నీ బంద్ పెట్టి ప్రజలను గోస పెడుతున్నాడని పేర్కొన్నారు. సద్ది తిన్న రేవు తలవాలి.. మనకు అన్నం పెట్టిన కేసీఆర్ ను మర్చిపోవద్దని అన్నారు.
బీజేపీ వాళ్లు ఓట్ల కోసం గిర్ర గిర్ర తిరుగుతున్నారని. వాళ్లు తూప్రాన్కు ఏమైనా చేశారా అని హరీశ్రావు ప్రశ్నించారు. ఒక్క హాస్పిటల్ కట్టించారా? కల్యాణ లక్ష్మి ఇచ్చారా? రూ. 15 లక్షలు వేస్తామని 12 ఏళ్లుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. పువ్వు గుర్తుకు ఓటేసినా, ఓటును మోరీలో పారేసినా ఒక్కటే. అది దండుగ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు వేస్తా అంటాడని.. హామీలు అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటాడని.. తులం బంగారం ఏది అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడని అన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? ఇలాంటి బూతుల ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల కోసం కౌన్సిలర్లను గెలిపించాలని సూచించారు. రెండేళ్ల తర్వాత వచ్చేది మళ్లే కేసీఆర్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తూప్రాన్ అభివృద్ధి బాధ్యత నాది. ఏ పని ఉన్నా నేను చేసి పెడతా అని హామీ ఇచ్చారు.