మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మెదక్ కలెక్టర్ హరీశ్, మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘2014లో ఓట్ల కోసం ఇక్కడికి వచ్చాను. నాడు చిన్న గ్రామ పంచాయతీ. ఇప్పుడు మున్సిపాలిటీగా మారి అద్భుతమైన పట్టణంగా అభివృద్ది చెందుతున్నది. అనేక సమస్యలకు పరిష్కారం లభించింది’’ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పేరిట 10లక్షల 30 వేల పెళ్లిళ్లకు రూ.9000 కోట్లు ఇచ్చామని హరీశ్ రావు చెప్పారు. ఎవరూ అడగకముందే తోబుట్టువుగా ముఖ్యమంత్రి ఈ పని చేశారని కొనియాడారు.
ఇక్కడ పేదలకు 504 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని, ఇవన్నీ చివరి దశలో ఉన్నాయని చెప్పారు. నెల లేదంటే నెలా 15 రోజుల్లో వీటిని పూర్తి చేసి ప్రజలకు అందివ్వాలని కలెక్టర్కుకు చెప్పినట్లు వెల్లడించారు. ‘‘ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఇంటి తాళం ఇస్తాము. ఇంటడుగు జాగా ఉంటే, ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు అందిస్తాం.
బడ్జెట్లో కూడా ఇదే ప్రతిపాదించాము. వడ్డీ లేని రుణం డబ్బులు రూ.500 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే ఒకటి రెండు నెలల్లో అర్హులైన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు. అనంతరం అర్హులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, రు. 2 కోట్లు విలువ చేసే ఎస్హెచ్జి చెక్కులను అందజేశారు.