Harish Rao | కేసీఆర్ది అభివృద్ధి అయితే రేవంత్ రెడ్డిది విధ్వంసమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. బుల్డోజర్లతో ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ ముషీరాబాద్ బోలక్పూర్లోని అంజుమన్ గర్ల్స్ హైస్కూల్లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీంతో కలిసి ముస్లిం మహిళలకు రేషన్ కిట్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మైనారిటీ నాయకులు సలీం ఇప్పటివరకు 10వేల తోఫా కిట్లను పంపిణీ చేశారని తెలిపారు. కేసీఆర్ నిరుపేదల గురించి ఆలోచించి షాదీ ముబారక్ పథకంతో లక్ష రూపాయలను అందజేసేవారని గుర్తుచేశారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక షాదీ ముబారక్ అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఇమామ్ మోజమ్లకు వేతనం పెంచుతామన్నారని.. తులం బంగారం ఇస్తామని అన్నారని.. ఏ ఒక్కటీ ఇవ్వలేదని చెప్పారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇళ్లు కూల్చారని తెలిపారు.
రేవంత్ రెడ్డి జూనియర్ యోగి అయిపోయాడని హరీశ్రావు విమర్శించారు. బుల్డోజర్లతో ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపారు. కేసీఆర్ది అభివృద్ధి అయితే రేవంత్ రెడ్డిది విధ్వంసమని అన్నారు. కేసీఆర్ వచ్చాక మంచినీటి ఇబ్బందులు పోయాయని.. కానీ మళ్లీ మంచినీటి ఇబ్బందులు పోయాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ ఎందుకు మాయమైందని ప్రశ్నించారు.
కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్న నాయకుడు కేసీఆర్ అని హరీశ్రావు తెలిపారు. మీ అందరి దయ వల్ల అల్లా దయవల్ల మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మళ్లీ మంచి రోజులు రావాలని అన్నారు. రంజాన్ నెల పవిత్ర మాసమని.. ఏదైనా కోరుకుంటే జరుగుతుందని వ్యాఖ్యానించారు. నేడు ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉందని తెలిపారు. సిలిండర్ దొరకడం లేదు.. నిత్యవసర ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ప్రజలందరి ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థించాలని సూచించారు. మళ్లీ అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుందామని పేర్కొన్నారు.