సిద్దిపేట, జనవరి 13: ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, నెలకు రూ.15 వేల చొప్పున జీవనభృతి ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు ఆటల పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటోడ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తప్పుపట్టడం లేదని, ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో 1,480 మంది ఆటోడ్రైవర్లు సభ్యులుగా ఉన్నారని, వారే సిద్దిపేటకు బ్రాండ్ అంబాసిడర్లు అని వెల్లడించారు. ఆటోడ్రైవర్లు నిత్యం బిజీగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టరని, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ఆటలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
పతంగుల పండుగ అంటేనే ఆనందం, ఆహ్లాదం అని, పతంగులకు దారం ఆధారం అయితే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోమటిచెరువు వద్ద కైట్ ఫెస్టివల్ను ఆయన ప్రారంభించి, ప్రజలతో కలిసి పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.