సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. వారికి ప్రతి నెల రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటోకార్మికులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని సూచించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలని తెలిపారు. ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి కల్పించాలని, లేదంటే వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వెల్లడించారు. ఆటోవాలలా జీవితంలో పండుగ వాతావరణం కనుమరుగైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారని, కానీ వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదంటున్నారని వ్యాఖ్యానించారు.