Harish Rao | హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యంపై ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. శాసనసభలో హరీశ్రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేవలం ఒక కిలో బియ్యం మాత్రమే ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోని 89 లక్షల 99 వేల కార్డుల్లో కేంద్రం 56 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇస్తుంది. మిగతా 34 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఖజనా నుంచి ఆరు కిలోల బియ్యం ఇచ్చాం. కేంద్రమే ఇస్తుంది.. రాష్ట్రం ఒక్క కిలోనే ఇస్తుందని ఉత్తమ్ చెప్పే ప్రయత్నం చేశారు. అది సత్య దూరం అని హరీశ్రావు తేల్చిచెప్పారు.
కరోనా సమయంలో రెండు సంవత్సరాల పాటు ఉచితంగా 10 కిలోల బియ్యం ఇచ్చామని హరీశ్రావు గుర్తు చేశారు. మొత్తం 2 కోట్ల 90 లక్షల మందికి బియ్యం ఇచ్చాం. కోటి 85 లక్షల మందికి కేంద్రం ఐదు కిలోల బియ్యం ఇస్తే మిగతా కిలో మనం ఇచ్చాం. కేంద్రం కిలో బియ్యాన్ని రూ. 3కు ఇస్తే మనం రూపాయికే ఇచ్చాం. మిగతా ఒక కోటి 5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల చేత ఆరు కిలోల బియ్యం ఇచ్చాం అని తెలిపారు.
కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో నిర్మించారు. 80 శాతం నిధులు ఖర్చు పెట్టారు. కానీ ఆయకట్టు ఇవ్వలేదు. కానీ ఇవాళ మేం వచ్చాక పనులు పూర్తి చేసి 3 లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పాలమూరు ఎత్తిపోతలలో ట్రంకులు, పంపులు, రిజర్వాయర్లు పూర్తయ్యాయి. మీరు కెనాల్స్ తవ్వితో ఆయకట్టు వచ్చే అవకాశం ఉంటుంది అని హరీశ్రావు చెప్పారు.