Harish Rao | కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే దండగా అన్నారని.. ఉత్తమ్ కుమార్రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారని.. మరి ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి సైతం దావోస్ వెళ్లారని.. దానిపై ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ గురువారం జరిగింది. కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్లో కేసీఆర్ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయన్నారు. కులాలు, మతాలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. అయినా కూడా ఎంతో అద్భుతంగా పని చేసి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేశారన్నారు.
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు. ఈ విజయం కార్యకర్తలదేనని.. అందరి కష్టమన్నారు. శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధినేతపై 154 నామినేషన్లు వేశారని.. అనేక కుట్రలు.. విత్ డ్రా తర్వాత 47 నామినేషన్లు మిగిలాయన్నారు. నాలుగు మిషన్ల ఏర్పాటుతో కొందరు గందరగోళానికి గురయ్యారన్నారు. కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు వేరే గుర్తులకు పడ్డాయన్నారు. ఇన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ 45వేల మెజారిటీతో గెలిపించి.. మూడోసారి గెలుపు అందించారన్నారు. గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
గజ్వేల్ అభివృద్ధి ఎంతో జరిగిందని.. మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వేల్పై అక్కసు కాంగ్రెస్ వెళ్లగక్కిందని విమర్శించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చాక తాగు, సాగునీటి సమస్య లేదన్నారు. కేసులు తగ్గాయని.. కుట్రలు తగ్గాయన్నారు. గత చరిత్రను బీఆర్ఎస్ తిరగరాసిందన్నారు. ఒక్కనాడు కాంగ్రెస్ నాయకులపై కేసుకు పెట్టలేదన్నారు. గజ్వేల్ ఎలా బాగు చేయాలి అని నిరంతరం కేసీఆర్ ఆలోచించారన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చి నెల రోజుకు కాలేదని.. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెడుతున్నారన్నారు. కేసీఆర్ గజ్వేల్ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే.. కాంగ్రెస్ వాళ్లు కేసులు, కుట్రలతో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారని.. రూ.4వేలకు ఫించన్లు పెంచుతామన్నారని.. కరెంట్ బిల్లు కట్టొద్దు అన్నారన్నారు. రైతుబంధు పెంచుతాం అన్నారని.. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామనన్నారని.. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేశారన్నారు.
ప్రగతి భవన్లో 250 గదులున్నాయని.. బంగారు బాత్ రూములు ఉన్నాయని ఆరోపణలు చేశారని.. అక్కడ ఉంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి వాస్తవాలు చెప్పాలన్నారు. బీజేపీతో కోట్లాడతం అని దోస్తీ చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. ఈ దేశం అదానీ, అంబానీల చేతుల్లో ఉందని.. అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నారని.. ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారని.. రేవంత్ రెడ్డి, అదానీ కలిసి హగ్లు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారన్నారు. ఇందులో రాహుల్ కరెక్టా, రేవంత్ కరెక్టా.. ? అంటూ ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్లు ఎందుకు కొట్లాడం లేదని నిలదీశారు. మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ కేంద్రమంత్రుల మెడలో నేడు పూలదండలు వేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు.