హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రోజువారీ ఖర్చులకూ, జీతాలు ఇవ్వడానికీ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా రూ.70 వేల కోట్లు కోత విధించారని చెప్పారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఓ టీవీ చానల్ చర్చలో మంత్రి హరీశ్రావు పాల్గొని కేంద్రం విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వివిధ రంగాల నిఫుణులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
రైతులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఏకంగా రూ.70 వేల కోట్లు కోత పడిందని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ కింద రూ.8 వేల కోట్లు, ఎరువుల సబ్సిడీలో రూ.50,120 కోట్లు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.9,243 కోట్లు, ఆర్కేవీవై పథకానికి రూ.3,283 కోట్లు తగ్గించారని మంత్రి పేర్కొన్నారు. పైగా రైతులకు రూ.20 లక్షల కోట్లు అప్పులు ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. రైతులకు ఇవ్వాల్సింది అప్పులు కాదని, ఉపశమనమని చెప్పారు. ఉచితంగా కరెంటు ఇస్తామనో, వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తామనో, సబ్సిడీలు, పీఎం కిసాన్ నిధులు పెంచుతామనో, పరికరాలు ఇస్తామనో చెప్పాల్సింది పోయి అప్పులు ఇస్తామనడం ఎక్కడి న్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయడంలో ఉన్న శ్రద్ధ పేదలకు, చేనేతలకు, బడుగులకు మేలు చేయడంపై లేదన్నారు. జీఎస్టీని ఎత్తివేయాలన్న చేనేతల డిమాండ్ను పట్టించుకోలేదని మండిపడ్డారు.
బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది రూ.17.80 లక్షల కోట్ల అప్పు తెస్తున్నదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అప్పు ద్వారా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడి వ్యయంగా వాడిందన్నారు. కానీ కేంద్రం తెచ్చే అప్పుల్లో 48.7 శాతం రోజువారీ ఖర్చులకు వాడుతున్నారని, జీతాలు ఇస్తున్నారని చెప్పారు. ఇది వారి పరిపాలనలో దేశ దుస్థితికి నిదర్శనమన్నారు. జీడీపీలో అప్పులు గతేడాది 55.9 శాతం ఉంటే ఈ ఏడాదితో 56.2 శాతానికి పెరుగుతున్నదని తెలిపారు. దేశ జీడీపీ కన్నా అప్పులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ బడ్జెట్లో గుజరాత్ గిఫ్ట్ సిటీకి, ఎన్నికలున్న కర్ణాటకకు మాత్రమే నిధులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణకు హక్కుగా రావాల్సినవేవీ ఇవ్వలేదన్నారు. ఏపీ నుంచి రావాల్సిన రూ.18,236 కోట్ల బకాయిలు ఇప్పించ లేదన్నారు. సీఎస్ఎస్ కింద పొరబాటున జమచేసిన రూ.495 కోట్ల గురించి 8 ఏండ్లలో వంద ఉత్తరాలు రాసినా ఒక్కపైసా రాలేదని, నీతి ఆయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సూచిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు స్టేట్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్గా రూ.6,386 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా, దేశ చరిత్రలోనే తొలిసారిగా కమిషన్ సూచనను తొక్కి పెట్టారని మండిపడ్డారు. ఇప్పటికే అనేక తెలంగాణ పథకాలను కాపీ కొట్టారని, ఇప్పుడు నర్సింగ్ కాలేజీల ఏర్పాటును సైతం తెలంగాణ నుంచే నేర్చుకున్నారని విమర్శించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ రెండేండ్ల కిందటే ప్రకటించినట్టు చెప్పారు. బీజేపికి ప్రజలకు సేవ చేయడం ద్వారా మనసులు గెలిచే పద్ధతి తెలియదని పంచాయతీలు పెట్టి, విద్వేషాలు పెంచి, రక్తపాతం చేసి గెలవడమే వారికి తెలుసన్నారు.
కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు 41 శాతం కాకుండా 30 శాతం మాత్రమే పంచుతున్నదని చెప్పారు. సెస్సుల రూపంలో మోసం చేస్తున్నదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి వసూలయ్యే పన్నుల్లో 41 శాతం ఇస్తే రాష్ర్టానికి వాటాగా రూ.22,733 కోట్లు రావాలని వివరించారు. సెస్సులను పక్కకు పెట్టి పంచడంతో రూ.17,166 కోట్లు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. దీంతో రూ.5,567 కోట్లు నష్టం కలిగిందని వెల్లడించారు. ఇలా 8 ఏండ్లలో కనీసం రూ.40 వేల కోట్లు నష్టపోయామని చెప్పారు. ఇవి వచ్చి ఉంటే ఇంకో మంచి పని చేసేవాళ్లమని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నది. ఏ ఒక్క రంగానికి కూడా ఈ బడ్జెట్ సంపూర్ణ న్యాయం చేయలేదు. ఇదొక భ్రమల బడ్జెట్. ముఖ్యంగా ఉపాధిహామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి నిధుల్లో దాదాపు 30 శాతం కోత విధించడం దారుణం. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నారు. తెలంగాణపై ఎప్పటిమాదిరిగానే నిర్లక్ష్యం చూపారు. పేదలకు అన్యాయం చేస్తూ, కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ను రూపొందించారు. బీజేపీ హయాంలో ఇప్పటికే రికార్డు స్థాయి అప్పులు చేశారు. ఈ ఏడాది దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూడటం దురదృష్టకరం. విద్య, వైద్యం వంటి కీలక రంగాలను కేంద్రం పూర్తిగా విస్మరించింది. విభజన హామీల గురించి కనీస ప్రస్తావన కూడా లేదు.
-ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు