Harish Rao | హైదరాబాద్ : ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓ రెండు, మూడు ఎంపీ సీట్ల కోసం వరద, బురద రాజకీయాలకు పాల్పడుతోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై దుష్ర్పచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
నిజానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌజ్లు, 203 కి.మీ. టన్నెల్స్, 1531 కి.మీ. గ్రావిటీ కెనాల్స్, 98 కి.మీ. ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు.. వీటన్నింటి సమూహమే కాళేశ్వరం. మీరు మేడిగడ్డకు ఎమ్మెల్యేలను తీసుకుపోయినప్పుడు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ను చూయిస్తే బాగుండేది. కోడిగుడ్డు మీద ఈకలను పీకిన చందంగా, బురద రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని హరీశ్రావు మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని.. రేపటి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార అని హరీశ్రావు పేర్కొన్నారు. ఇవాళ భూముల్లో పెరిగిన ఊటలు, ఉబికివస్తున్న బోరు బావులు కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు. కూడవెల్లి, హల్దీవాగు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద పచ్చని పంటలు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం ఫలితమే అని చెప్పారు.
మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన దాని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టను డ్యామేజ్ చేయాలని దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ సంఘటనను అని తాము అసెంబ్లీలో ఇప్పటికే చెప్పాం. ఏ విచారణకైనా సిద్ధమని మేం అసెంబ్లీలో చెప్పాం. దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పాం. కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని కోరాం. కానీ ప్రభుత్వం పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా దుష్ట రాజకీయాలకు పాల్పడుతోంది. గత చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నట్టు చేస్తున్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో 1958లో కడెం ప్రాజెక్టు కట్టగానే గేట్లతో సహా కొట్టుకుపోయింది. తిరిగి పునరుద్ధరించారు. తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయింది. 1981, 1999లో సింగూరు డ్యాం పాక్షికంగా కొట్టుకుపోయింది. 2010లో ఎల్లంపల్లి బ్యారేజీ స్పిల్ వే కొట్టుకుపోయింది. 2004లో సాత్నాల ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయింది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళ్టికి కొట్టుకుపోయాయి. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లై ఓవర్ కడుతుంటే కూలిపోయింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పోలవరంలో డయాఫ్రేమ్, గైడ్ వాల్స్ కొట్టుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఏదన్న మేజర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే చర్యలు తీసుకుంటారు. రైతాంగానికి నష్టం జరగకుండా పునరుద్ధరణ చర్యలు తీసుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం కాళేశ్వరం మీద దుష్ర్పచారం చేస్తోంది అని హరీశ్రావు మండిపడ్డారు.