హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతిపట్ల హరీశ్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
BRS MLA Lasya Nanditha Latest Interview
తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్య నందిత మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా, విధి మరొకటి తలచిందన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతి ఎంతో బాధ కలిగించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ఆకాంక్షించారు.
లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. చిన్న యయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య.. మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదు.
– తలసాని శ్రీనివాస్ యాదవ్
చిన్న వయస్సులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంచి రాజకీయ భవిష్యత్తు ఉండి, తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరి మన్ననలు పొందుతున్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరం. సంవత్సరం క్రితం వారి తండ్రి సాయన్న మరణం, ఇప్పుడు కూతురు నందిత అకాల మృత్యువుకు లోనుకావడం విచారకరం. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిజేస్తున్నాను.
– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
లాస్య నందిత మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.
– వేముల ప్రశాంత్ రెడ్డి
చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై.. తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరి మన్ననలు పొందిన నందిత అకాల మరణం తీవ్ర బాధాకరం. ఏడాది క్రితం సాయన్న మరణం, ఇప్పుడు ఆయన కూతురు మృతి చెందడం విచారకరం
– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. లాస్య గొప్ప భవిష్యత్ ఉన్న యువ నాయకురాలు. ప్రజల మద్దతుతో ఎన్నికై ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి