హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : ఫిలిప్పీన్స్కు బియ్యం అంశంపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. రైస్ ఎగుమతిలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపణలు చేయడంతో సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన ఆయన, నిజాయితీ ఉంటే ఫైళ్లు స్పీకర్ ముందు పెడితే స్కామ్ను నిరూపిస్తానని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సర్కార్కు సవాల్ విసిరారు. బియ్యం ఎగుమతి చేసేందుకు సర్కార్ నియమించిన అడ్వైజర్ ప్రేమ్చంద్ గార్గ్ ఘరానా మోసగాడని విమర్శించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తిని సలహాదారుగా పెట్టుకోలేదా? అతడి సలహా వల్లే రాష్ర్టానికి నష్టం జరిగింది నిజం కాదా? అని సర్కార్ను నిలదీశారు.
ఇదేం రికార్డో చెప్పాలి : పల్లా రాజేశ్వర్రెడ్డి
ధాన్యం సేకరణలో రికార్డు .. రికార్డు అంటున్నారు.. ఇదెక్కడి రికార్డు అంటూ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ సర్కార్ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేసిందని రికార్డులను సభ ముందుంచారు. 2019-20లో 111లక్షల మెట్రిక్ టన్నులు.. 2020-21లో 141లక్షల మెట్రిక్ టన్నులు, 2021-22లో 120.65, 2022-23లో 131లక్షల మెట్రిక్ టన్నులు అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023లో 95.31లక్షల మెట్రిక్ టన్నులు. 2024లో 100.31లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని ఇదెలా రికార్డ్ అవుతుందో చెప్పాలని నిలదీశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకే కేంద్రం అనుమతిచ్చిందని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తరుణంలో వరి ధాన్యం కొంటారో లేదో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కేంద్రాలను ఆలస్యంగా తెరువడం వల్ల రైతులకు మద్దతు ధర రావడం లేదని ఆరోపించారు. గత యాసంగి సన్నవడ్ల బోనస్ రూ.1,208కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. దొడ్డు వడ్లకు సైతం రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు.
నాఫెడ్కు బియ్యం ఎందుకు ఇవ్వలేదు
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.. నాఫెడ్ కు బియ్యం ఎందుకివ్వలేదని హరీశ్రావు అసెంబ్లీలో నిలదీశారు. అడ్వాన్స్గా డబ్బులిస్తామని నాఫెడ్ జేఎండీ, ఎండీ లేఖ రాసి నా ఇవ్వని ప్రభుత్వం.. టెండర్లు పిలువకుండా నామినేషన్ పద్ధతిలో ఫిలిప్పీన్స్కు ఎందుకు ఎగుమతి చేసిందని ప్రశ్నించారు. ఇదొక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అని, తమ విజయమంటూ గొప్పలు చెప్పుకొని హెలికాప్టర్లో కాకినాడకు వెళ్లి మంత్రి జెండా ఊపారు.. కానీ ఇప్పుడది పెద్దస్కామ్గా మారిందన్నారు. 27,500 మెట్రిక్ టన్నుల వద్దనే ఎగుమతులు ఎందుకు ఆ గాయని ప్రశ్నించారు. ఇక 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పట్టి వృథాగా ఉంటే.. గోదాం, హ్యాండ్లింగ్ చార్జీల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడటం లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కావాలంటే అందరం కాకినాడ పోర్టుకు వెళ్తామని చెప్పారు.