Harish rao | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కమర్షియల్ట్యాక్స్ విధానాలు దేశానికే ఆదర్శమని, పన్నుల వసూళ్లలో తెలంగాణది నంబర్వన్ స్థానమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. పలు రాష్ర్టాల వాణిజ్యపన్నుల శాఖలు తెలంగాణలో పర్యటిస్తున్నాయని, మన వాణిజ్యపన్నుల విధానాలను అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో వాణిజ్యపన్నుల శాఖ ఆదాయ వనరుల పెంపుదలపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో హరీశ్రావు మాట్లాడుతూ… సొంత ఆదాయ వనరుల వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉన్నదని చెప్పారు. మంచి విధానాలు, పారదర్శకమైన పద్ధతులు అవలంబిస్తే రెవెన్యూగ్రోత్ ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. పాలకులు, అధికారులు సమష్టిగా కృషిచేస్తే అద్భుతాలు సాధ్యమని.. దీనికి వాణిజ్యపన్నుల శాఖే నిదర్శనమని తెలిపారు.
సంక్షేమంలో వాణిజ్యపన్నుల శాఖదే పెద్దచేయి
వాణిజ్యపన్నుల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో రూ.72,564 కోట్ల పన్ను వసూళ్లతో లక్ష్యాన్ని అధిగమించి చరిత్రను సృష్టించిందని హరీశ్రావు తెలిపారు. దీనికోసం కృషి చేసిన ప్రతి ఒకరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ లక్ష్యాన్ని అధిగమించాలనే ఆలోచనతో సదస్సు నిర్వహించడం సంతోషకరమని అభినందించారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేనట్టుగా తెలంగాణలో ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటికోసం ఎంతో ధనాన్ని వెచ్చించాల్సి వస్తున్నదని చెప్పారు. ధనాన్ని సమీకరించటంలో వాణిజ్యపన్నుల శాఖదే పెద్దచేయని తెలిపారు. ఇది దృష్టిలో ఉంచుకొని 2023-24 ఆర్థిక సంవత్సరం వాణిజ్యపన్నుల శాఖకు రూ.85,413 కోట్లను బడ్జెట్ లక్ష్యంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. అధికారులు సమీకరించే ప్రతి రూపాయి సమాజంలోని అట్టడుగు ప్రజల కోసం వినియోగించబడుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కోరారు.
తెలంగాణది ఆచరణ.. దేశానికి అనుసరణ
తెలంగాణ ఆచరిస్తున్నదని, దేశం అనుసరిస్తున్నదని హరీశ్రావు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మరింత పెంచాలని, దేశంలోనే తెలంగాణను అభివృద్ధికి సూచికగా పదిలం చేయాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమపథకాలు, కార్యక్రమాలను కేంద్రం అనుసరిస్తున్నదని తెలిపారు. మిషన్ భగీరథ, రైతుబంధు, మూగజీవాలకు అంబులెన్స్, జిల్లాకో మెడికల్ కాలేజీ.. ఇలా రాష్ట్రం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు, కేంద్ర ప్రభుత్వానికి మాడల్గా నిలుస్తున్నాయని చెప్పారు. ఎనిమిదేండ్లలో ఓన్ రెవెన్యూగ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిరేటులోనూ తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు.
త్వరలోనే నియామకాలు, బదిలీలు
వాణిజ్యపన్నుల విభాగంలో 95 ఏసీటీవో పోస్టులతోపాటు బదిలీల విషయాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఇదేస్ఫూర్తితో పనిచేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. వాణిజ్యపన్నుల శాఖలో ప్రతిభ చూపిన అధికారులను అభినందించారు. గత పాలకులు అభివృద్ధి అంటే..ఐటీ, సంక్షేమం, వ్యవసాయం ఇలా ఏదో ఒకదాన్నే పట్టుకుని ఉండేవారని, కానీ ఇప్పుడు కేసీఆర్ ఐటీ, సంక్షేమం, వ్యవసాయంతోపాటు అన్ని రంగాలను కలిపి సక్సెస్ మంత్రంతో నడిపిస్తున్నారని, ఫలితంగా ఇవాళ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని కొనియాడారు. 158 మంది ఆఫీసర్లు ఆరు టీమ్లుగా ఏర్పడి, విభిన్న రంగాల్లో పన్నులు ఏవిధంగా ఎగవేతకు గురవుతున్నాయో గుర్తించి, వెలికి తీయడానికి అందరి అనుభవాలను, ఆలోచనలు అన్నింటినీ మేళవించి ఒక ప్రణాళిక తయారు చేయబోతున్నారని, ఈ సరికొత్త ప్రయోగానికి ముందస్తుగా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కమర్షియల్ట్యాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.