యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): నాలుగేండ్లపాటు గెలిచి నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్రెడ్డి.. ఇప్పుడు మళ్లీ గెలిపించాలని కోరడం హాస్యాస్పదంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక నమ్మకస్తులు, నమ్మకద్రోహుల మధ్య జరుగుతున్నదని తెలిపారు. ‘రాజగోపాల్రెడ్డి ధ్యాసంతా కాంట్రాక్టులు, పైసలపైనే.. నాలుగేండ్లలో ఆయన మునుగోడుకు చేసిందేంది? ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఎందుకు కట్టించలేకపోయారు? ప్రజలకు ఈ నాలుగేండ్లలో రాజగోపాల్రెడ్డి ఏం చేసిండు?’ అని హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ మాటలు నమ్మి మోసపోతే గోసపడుతామని చెప్పారు. బీజేపీకి ఓటేస్తే బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టుడు ఖాయమని.. కరెంట్ మీటర్లు కావాలో, ఉచిత కరెంటు కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు. గెలిపిస్తే 3000 పింఛన్ అంటూ బీజేపీ నాయకులు ఝూటా మాటలు మాట్లాడుతున్నారని, నమ్మి ఓటేస్తే గ్యాస్ ధరను రూ.1500కు పెంచుతారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వని కేంద్ర మంత్రులు ప్రచారానికి వస్తే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీని పాతాళంలోకి పాతిపెట్టాలని ఓటర్లను కోరారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని మర్రిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్తోపాటు సీపీఎం, సీపీఐ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రచార ర్యాలీలో హరీశ్రావు చేసిన ప్రసంగం, ఆయన మాటల్లోనే..
గడిచిన 8 ఏండ్లలో కేంద్రంలో ఒక్క మంచి పథకం కూడా తీసుకురాలేదు. బీజేపోళ్లకు చెప్పుకోవడానికి ఏమీలేకనే, ఎప్పుడూ సీఎం కేసీఆర్పై పడి ఏడుస్తున్నరు. బీజేపీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తమని గొప్పలు చెప్పింది. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్నవి ఊడబీకింది. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నింపుతలేదు. తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలిచ్చారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు నల్లచట్టాలు తెచ్చి పంటలకు మద్దతు ధర లేకుండా చేసింది. కరెంట్ చట్టాలు తెచ్చింది. బీజేపోళ్లు డబ్బులనే నమ్ముకున్నరు. 18వేల కాంట్రాక్టుల్లో కొంత డబ్బులు పంచి గెలువాలని కుట్ర చేస్తున్నరు. బీజేపీ డబ్బులను నమ్ముకుంటే.. మేము ప్రజలను నమ్ముకున్నం. సంక్షేమ పథకాలను వివరిస్తున్నం. బీజేపీ ఝూటా పార్టీ. ఆ నాయకుల మాటలు నమ్మొద్దు.
బాయికాడ మోటర్లకు మీటర్లు పెడితే ఏమవుతుందని రాజగోపాల్రెడ్డి అంటున్నారు. పొరపాటును బీజేపీని గెలిపిస్తే.. మీటర్లను ప్రజలు ఆమోదిస్తున్నారని గొప్పలు చెప్పుకొంటరు. తప్పకుండా మీటర్లు పెట్టేదాకా వదిలిపెట్టరు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ర్టానికి రావాల్సిన 30వేల కోట్ల నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా మీటర్లకు అంగీకరించలేదు. బీజేపీ నేతలు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నరు, చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు. ఈ ఝూటా మాటలు నమ్మి మోసపోతే గోసపడుతం. ప్రలోభాలు, డబ్బులకు ఆశ పడొద్దు. తస్మాత్ జాగ్రత్త.
తెలంగాణ వస్తే ఏమొచ్చిందని బండి సంజయ్ అంటున్నరు. తెలంగాణ వస్తే రూ.200 ఉన్న పింఛన్.. రూ.2,016 అయ్యింది. మనిషికి 10 కిలోల బియ్యం ఇచ్చి కడుపు నింపుతున్నం. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినం. గిరిజనులకు రిజర్వేషన్లు వచ్చినయి. మర్రిగూడలో కట్టిన ప్రతి ఒక్క కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా ఉందని బీజేపోళ్లు ఝూటా మాటలు మాట్లాడుతున్నరు. నేను కనుక్కుంటే అసలు మర్రిగూడలో ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేదు. అన్ని ఫంక్షన్లలో బీజేపీ పైసలు ఉన్నయంటున్నరు. ఆ నాయకులు నోరిప్పితే అన్నీ అబద్ధాలే.
మునుగోడు నియోజకవర్గానికి మిషన్ భగీరథ నీళ్లొచ్చినయ్. డబుల్ రోడ్లు అయినయ్. భూముల రేట్లు పెరిగినయి. ఒకప్పుడు కాళ్లు వంకర పోతయని పిల్లను ఇచ్చేందుకు భయపడేటోళ్లు. ఇయ్యాల బ్రహ్మాండంగా కృష్ణాజలాలు పారుతున్నాయి. రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం అవుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పొలాలన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చినట్లు పొలాలకు కృష్ణాజలాలను తీసుకొస్తం. సీపీఎం, సీపీఐ శ్రేణులు బ్రహ్మండంగా పనిచేస్తున్నారు. రాష్ట్రం రాకముందు, ఇప్పుడు తెలంగాణ ఎట్లా మారిందో మునుగోడు ప్రజలు ఆలోచించాలె. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలె. మూడో తారీఖుతో ఎన్నికలైపోతయి. ఆ తర్వాత సీఎంగా కేసీఆర్, ఆర్థికమంత్రిగా నేనే ఉంటం. టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడు అభివృద్ధికి మేం జిమ్మేదారి తీసుకుంటం. అదే రాజగోపాల్రెడ్డి గెలిస్తే ఏం జేస్తడు? తిట్టుకుంటూ తిరుగతడు. గెలిపిస్తే గీ పనిచేస్తా అని చెప్పే పరిస్థితి లేదు. రాజగోపాల్రెడ్డీ.. భూనిర్వాసితులకు గవర్నమెంట్ ఇవ్వకపోతే సొంత పైసలు ఇస్తానంటివి. నిన్ను నమ్మి శివన్న గూడెం ప్రజలు మోసపోయారు. ముస్లింలను కూడా నమ్మించి మోసం చేసినవ్. నీ అబద్ధపు మాటలు నమ్మే పరిస్థితి ఇకపై లేదు. ఇయ్యాల ఎవరేందో అందరికీ తెలుసు. మేం పనిచేసినం. ఇకముందు కూడా చేస్తమని జిమ్మేదారి ఇస్తున్నం.
‘మునుగోడు ఎన్నికలు ఎందుకు వచ్చాయో అందరూ ఆలోచించాలి. ఎక్కడైనా సచ్చిపోతే ఉపఎన్నిక వస్తుంది. కానీ కాంట్రాక్టుకు రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోవడంతో మునుగోడులో బైపోల్ వచ్చింది’ అని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయలేకనే రాజీనామా చేశానని రాజగోపాల్రెడ్డి చెబుతున్నారని, నాలుగేండ్లు అభివృద్ధి చేయని వ్యక్తి మళ్లీ గెలిచి ఏంచేస్తారని ప్రశ్నించారు. 18వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను జిల్లా అభివృద్ధికి ఇవ్వాలని, అట్లయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల బరి నుంచి తప్పకుంటారని ఆయన మరోమారు బీజేపీకి సవాల్ చేశారు. ఆ డబ్బుతో నల్లగొండను సస్యశ్యామం చేస్తామన్నారు.