(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా తదనంతర పరిస్థితులతో దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల రైతుకూలీల బతుకులు దుర్భరంగా మారాయి. 2022-23 కేంద్ర ప్రభుత్వ ఆర్థికసర్వే ప్రకారం గ్రామీణ రైతుకూలీల దినసరి వేతనాలు గత రెండు సంవత్సరాల్లో పెరుగకపోగా తగ్గాయని గణాంకా లు చెబుతున్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 36.5 కోట్ల కార్మికులుండగా, వారిలో 61.5 శాతం మంది వ్యవసాయరంగంలో, 20 శాతం మంది పారిశ్రామికరంగంలో పని చేస్తున్నారు.
మిగతా 18.5 శాతం కూలీలు వివిధరకాల రంగాల్లో పనిచేస్తున్నారు. వాటి లో నిర్మాణరంగం, రిటైల్ వ్యాపారం, గృహకార్మికులు, ఇంటిపనులు, తదితర సేవారంగాల్లో పనిచేస్తున్నారు. ఒక సర్వే ప్రకారం గ్రామంలో వ్యవసాయకూలీ పనులు కాక 61 రకాల పనులను గుర్తించారు. 11 ఏండ్ల క్రితం జరిగిన జనగణన ప్రకారమే భూమి లేని వ్యవసాయకూలీల సంఖ్య దాదాపు 14 కోట్లు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. ఆర్ధికసర్వే నివేదిక ప్రకారం 2020తో పోలిస్తే 2022లో పురుషుల రోజువారీ వేతనం 17 శాతం పెరిగి రూ.364 అయింది. మహిళా కూలీల దినసరి వేతనం రూ.271 అంటే.. 12 శా తం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. కా నీ ఈ పెరుగుదల ఒక భ్రమే. వాస్తవానికి ఆర్థికమాంద్యంతో పెరిగిన నిత్యావసర ధరలతో పోలిస్తే పురుషుల వాస్తవ వేతనం రోజుకు రూ.207 నుంచి రూ.204 వరకు తగ్గిం ది. అలాగే మహిళాకూలీల దినసరి వేతనం రూ.160 నుంచి రూ.152కి తగ్గింది.
ప్రభుత్వ విధానాలతో మరింత దుర్భరం
కేంద్రం పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెట్టే నిధుల్లో కోత పెడుతుండటం వల్ల గ్రామీణప్రాంతాల్లోని పేదలు, ముఖ్యంగా రైతుకూలీలు మరింత నష్టపోతున్నారు. ఆర్థికసర్వే ప్రకారం అనారోగ్య పరిస్థితుల్లో పేదలు ప్రవేటు వైద్యులను ఆశ్రయించటం వల్ల వారి ఆదాయం అంతా ఖర్చయి అప్పుల పాలవుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆధ్వర్యంలోని జాతీయ గణాంకాల కార్యాలయం (నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్)గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం 50 శాతానికి పైగా వ్యవసాయకుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తేలింది.
ఉపాధి హామీ పథకం కింద లభిస్తున్న కూలీ తక్కువే
గ్రామీణప్రాంతాల్లోని కూలీలకు పని కల్పించాలని ప్రారంభించిన ఉపాధిహామీ పథకంలో ఇటీవల కేంద్రం సాంకేతిక పద్ధతిని అమలు చేసింది. దీంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. మొబైల్యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు, కూలీడబ్బుల చెల్లింపుల్లో జాప్యంలాంటి సమస్యలతో విసిగిపోయి రైతుకూలీలు చాలామంది తమంతట తామే ఉపాధిహామీ పనులు మానుకుని వేరే పనులకు వెళుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఉపాధిహామీ పథకం కింద 8.19 కోట్ల మంది లబ్ధి పొందారు. కాని 2019-20లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో 7.88 కోట్ల మంది కూలీలు ఉపాధిహామీ పథకం కింద కూలీ పనులు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఉపాధిహామీ పథకంలో ప్రస్తుత సంవత్సరం సగటున రోజువారీ కూలీరేటు సుమారు రూ.218 లభిస్తుండగా, గత ఏడా ది రూ.209 లభించింది. అంతకుముందు ఏడాది రూ.201 లభించింది. పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కలు వేస్తే ప్రస్తుత సంవత్సరంలో లభిస్తున్న కూలీరేటు రూ.122 మాత్రమే. ఇది వ్యసాయేతర పనులు చేస్తే వచ్చే కూలీ కంటే రూ.100 తక్కువ. పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తక్కువ కూలీకైనా.. లక్షలాది మంది గ్రామీణ రైతుకూలీలు పనిచేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో గ్రామీణ రైతుకూలీలు పట్టణాలకు వలస పోతున్నారు.
కనీస వేతనాల చట్టం ఏది?
స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా, బీజేపీ ప్రభుత్వం దీన్ని అమృత్కాల్ అంటూ ఆర్భాటంగా చెప్పుకుంటున్నా.. గ్రామీణ రైతుకూలీలకు కనీస వేతనాల చెల్లింపు కోసం, పని పరిస్థితులను నియంత్రించేదుకు ఎలాంటి చట్టం చేయకపోవటం శోచనీయం. వ్యవసాయ కార్మికసంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో గ్రామీణ రైతుకూలీల పరిస్థితి నానాటికి దిగజారుతున్నది. ఆర్థిక అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి.