హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఆధారాలు సేకరించే క్రమంలో సిట్ అధికారులు జర్నలిస్టులను వేధిస్తున్నారు. ‘న్యూ సెన్స్’, ‘కంట్రోల్ రూమ్’ అనే వాట్సాప్ గ్రూప్లకు అడ్మిన్లుగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు రమేశ్ వైట్ల, ఆకుల శ్యాంసుందర్కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విచారణకు పిలిచారు. ఆదివారం, సోమవారం కొనసాగిన ఈ విచారణలో పొంతనలేని పలు ప్రశ్నలతో ఆ ఇద్దరు జర్నలిస్టులను వేధించారు. ఫోన్ల ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆ వాట్సాప్ గ్రూపుల్లో జరిగే డిస్కషన్ను ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు? మీకు సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు చర్చలు పెడుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రశ్నలకు రమేశ్ వైట్ల, శ్యాంసుందర్ దీటుగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వారి ఫోన్లు, వాటిలోని సమాచారం కావాలని సిట్ విచారణాధికారి వెంకటగిరి కోరినట్టు తెలిసింది.