మహబూబాబాద్ : బతుకమ్మ పండుగకు వచ్చే ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం తొర్రూరు జడ్పీ హైస్కూల్ లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు బతుకమ్మ పండుగను రాష్ట్రమంతటా వేడుకలా జరపాలని, ఆడబిడ్డలకు చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు.మహిళలను గౌరవించుకుంటూ పుట్టింటి సారెగా రూ 333.14 కోట్లతో బతుకమ్మ చీరలను రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతతో ప్రతి మహిళకు అందే విధంగా కృషి చేయాలన్నారు. కులవృత్తులను ప్రోత్సహించాలని చేనేత పరిశ్రమకు చేయూత అందివ్వాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో 11. 25 కోట్లతో జిల్లా లో నెంబర్ వన్ గా పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
అనంతరం వెలికట్టలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహిళలకు చీరలను, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, స్వయం సహాయక మహిళలకు 7 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా మహిళలు, జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి కోలాటం ఆడి స్టెప్పులు వేశారు.
కార్యక్రమాల్లో జడ్పీ సీఈఓ రమాదేవి, తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వెలికట్ట గ్రామ సర్పంచ్ పుష్పాలీల, ఎంపీపీ అంజయ్య, జడ్పిటిసి శ్రీనివాస్, ఆర్డీవో రమేష్ డిఆర్డిఎ, ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్యా, కాకిరాల హరిప్రసాద్, తాసిల్దార్ రాఘవ రెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.