ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన కురువ భీమప్ప–ఎల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు హనుమంతు (అలియాస్ తికిలప్ప) 11 ఏళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. 13 ఏళ్ల వయసులో వలస సమయంలో తప్పిపోయిన హనుమంతు, 24 ఏళ్ల యువకుడిగా తిరిగి ఇంటి గడప తొక్కడంతో తల్లిదండ్రుల 11 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. భీమప్ప, ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, అందరిలో చిన్నవాడైన హనుమంతు 13 ఏళ్ల వయసులో గొర్రెలను మేపేందుకు తండ్రితో కలిసి వలస వెళ్లాడు.
ఆ సమయంలో అనుకోకుండా తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో ఏళ్ల తరబడి ఎదురుచూశారు.
ఇటీవల చెన్నైలోని ‘మనసు’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హనుమంతు వివరాలను గుర్తించారు. గూగుల్ సహాయంతో తిప్రాస్పల్లి గ్రామాన్ని గుర్తించి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త నరసింహ వెంటనే చెన్నై వెళ్లి అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి హనుమంతును క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. 11 ఏళ్ల తర్వాత కుమారుడిని కళ్లారా చూసిన భీమప్ప, ఎల్లమ్మ దంపతులు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. 13 ఏళ్ల బాలుడిగా తప్పిపోయిన కుమారుడు 24 ఏళ్ల వయసులో ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హనుమంతు ఆచూకీ కనుగొని స్వగ్రామానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ‘మనసు’ స్వచ్ఛంద సంస్థ, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఆమె భర్త నరసింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.