హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం కాషాయమయమైంది. లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఆలయ అర్చకులు తెల్లవారుజాము 3 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులకు తిరుమంజనం, ద్రావిడ పారాయణాలు చేసి చందనాలంకరణ చేశారు.
ఉదయం 10 గంటలకు తులసీ అర్చన చేశారు. యాగశాలలో ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి మంగళ స్నానం చేయించి, భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం తరఫున అధికారికంగా అందజేసిన పట్టువస్ర్తాలతో అలంకరించారు. జయంతిని పురస్కరించుకొని లక్ష తమలపాకులతో ముస్తాబు చేశారు. మహానివేదన చేసి సామూహిక భజనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
– మల్యాల