Bandi Sanjay | వరంగల్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోను ఉద్దేశపూర్వకంగా పరీక్ష కేంద్రం నుంచి బయటికి తెప్పించి.. పరీక్ష జరుగుతున్నప్పుడే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి హనుమకొండ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బం డి సంజయ్ అరెస్టు అక్రమమని ఆయన తరఫు న్యా యవాదులు వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్పై 120 (బీ), 420, 447, 505(1), 4(ఏ), తెలంగాణ రాష్ట్ర పరీక్షల నిర్వహణ చట్టం 46, 8, 66(డీఐటీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవన్నీ నాన్బెయిలబుల్ సెక్షన్లే. మరోవైపు హనుమకొండ జిల్లా కోర్టులో బండి గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 8 గంటలపాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం బండికి జడ్జి రాపోలు అనిత రూ.20 వేల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బండి సంజయ్తోపాటు మిగిలిన నలుగురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నిందితులు చేసిన తప్పుడు ప్రచారం వల్ల పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు వాదించారు. కస్టడీ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసినందున, బెయిల్ పిటిషన్పై విచారణను కూడా అలాగే చేయాలని కోరా రు. నిందితులను బెయిల్పై విడుదల చేస్తే తిరిగి పేపర్ లీకేజీ వార్తలను వ్యాప్తి చేసే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. నిందితులకు బెయిల్ ఇస్తే ఎస్సెస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరగవని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే ఎస్సెస్సీ పిల్లల తల్లిదండ్రులు బండి సంజయ్, ఇతర నిందితులపై దాడులు చేసే ప్రమాదం ఉన్నదని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తి అనేకమంది రోడ్లమీదకు వచ్చి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనతో విబేధించిన కోర్టు, బండి సంజయ్కి బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందే నిందితులందరినీ మూడురోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ‘ప్రధాన నిందతుడిగా ఉన్న బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగానే తన ఫోన్ను పోలీసులకు ఇవ్వలేదు. సెల్ఫోన్ నుంచి కాల్ డాటా, వాట్సాప్ తదితర వివరాలు సేకరించాల్సి ఉన్నది. నిందితులు ఉద్దేశపూర్వకంగా ఒక గ్రూపుగా ఏర్పడి ఒకటి తర్వాత ఒకటి పేపర్ పదో తరగతి పేపర్లను లీక్ చేశారు. పదో తరగతి పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఆ నెట్వర్క్ను ఛేదించడం కోసం బండి, ఇతర నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసులో మరికొంతమంది పరారీలో ఉన్నారు. వారి వివరాలు సేకరించాలంటే నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించవలసిన అవసరం ఉన్నది’ అని వాదించారు.