హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మందికి పైగా నేత కార్మికులు హాజరుకానున్నట్టు తెలిసింది. ఇప్పటికే అన్నివర్గాల నుంచి కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత పెరుగుతుండగా, తాజాగా చేనేత కార్మికులు సైతం ఆందోళన బాటకు సిద్ధమయ్యారు.
ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత అనేక పోరాటాల అనంతరం రుణమాఫీ చేసింది. రుణమాఫీ మాదిరిగానే మిగిలిన సమస్యలను సైతం పోరాటాలతోనే సాధించుకోవాలని నేత కార్మికులు ముందుకెళ్తున్నారు. గత సర్కార్ నుంచే కొనసాగుతున్న చేనేత చేయూత పేరు మార్చి భరోసా పథకం తెచ్చారు. కానీ, ఇప్పటివరకు అమలు చేయడం లేదు. ఇక త్రిఫ్ట్ పథకంలో డిపాజిట్ చేసిన వారికి సర్కార్ రెండు నెలలు సపోర్టు చేసి ఆ తర్వాత ఎగనామం పెట్టింది.
జియోటాగ్ ఉండి మరణించిన నేత కార్మికుల కుటుంబాలకు ఏడాది గడిచినా బీమా డబ్బులు విడుదల చేయలేదు. సహకారోద్యమాన్ని తుంగలో తొక్కారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. చేనేత పారిశ్రామిక సహకార సంఘం క్వాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయని పరిస్థితి నెలకొన్నది. ఈక్రమంలో కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నిర్వహించే మహాధర్నాకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు హాజరుకానున్నట్టు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ తెలిపారు. సమస్యలు పరిష్కారమ య్యే వరకు పోరుబాట వీడబోమని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : చేనేత, పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 25న నిర్వహించే మహాధర్నాకు కార్మికులు, యజమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ పిలుపునిచ్చారు. శనివారం సిరిసిల్లలోని బీవై నగర్ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు.
అనంతరం రమేశ్తోపాటు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడారు. చేనేత, పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, భట్టి విక్రమార్కను కలిసి విన్నవిస్తే.. రూ.258 కోట్లు మాత్రమే కేటాయించి నేతన్నలకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు.