హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘ఏమీ ఇవ్వని మోదీ ఎందుకొస్తున్నావ్..’ అంటూ తెలంగాణ నిలదీసింది. ‘మోదీ గోబ్యాక్’ అంటూ నినదించింది. మోదీ పర్యటన నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే సింగరేణి కోల్బెల్ట్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బొగ్గుగని కార్మికులు, చేనేత కార్మికులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. ధర్నాలు చేపట్టారు. ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోదీపై ప్రజానిరసనను నిలువరించేందుకు పలుచోట్ల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయిన్పటికీ ఆందోళనలు ఆగలేదు. పలుచోట్ల నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేసి, పోలీస్స్టేషన్లకు తరలించారు. రామగుండం పట్టణంలో జనం తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. నిరసనలపై నిర్బంధం కొనసాగుతుండగా మోదీ తన పర్యటనను పూర్తిచేసుకున్నారు.
కేంద్రం వివక్షకు నిరసనగా అన్ని విశ్వవిద్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్వీ శనివారం నిరసన ర్యాలీలు చేపట్టింది.
‘మోదీ గోబ్యాక్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించింది. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధింపును వ్యతిరేకిస్తూ, మోదీ రాకను నిరసిస్తూ.. హైదరాబాద్ కేబీఆర్పార్క్ వద్ద తెలంగాణ చేనేత యూత్ఫోర్స్ ఆధ్వర్యంలో బ్లాక్ బెలూన్లు ఎగురవేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. రామగుండంలో ప్రధాని మోదీ సభను ఆడ్డుకునేందుకు బయలుదేరి వెళ్తున్న ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, అధికార ప్రతినిధి కొండ సంపత్కుమార్, రాష్ట్రనాయకులు సముద్రాల లక్ష్మణ్, ఆల్వాల శంకర్ తదితరులను సిద్దిపేట టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి రాజగోపాల్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో టీఆర్ఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 500మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సీతక్క బైక్ ర్యాలీ నిర్వహించారు.
నిరసనలతో హోరెత్తిన సింగరేణి
సింగరేణి తారా చమ్మాస్తో మోదీపై నిరసనగళమెత్తింది. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాల్లోని బొగ్గుబావుల వద్ద కార్మికులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కోల్బెల్ట్లోని అన్ని జిల్లాల, మండల కేంద్రాల్లో టీబీజీకేఎస్, టీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం పార్టీలు, కార్మిక, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. గోదావరిఖనిలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతోపాటు పెద్దసంఖ్యలో నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐటీయూ సింగరేణి విభాగం అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఆహ్మద్ తదితరులను అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు.
వామపక్షాల ఆధ్వర్యంలో..
‘మోదీ గో బ్యాక్’ నినాదంతో శనివారం హైదరాబాద్లో సీపీఐ నల్లజెండాలతో ర్యాలీ చేపట్టగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లా కార్యదర్శి ఈటీ నర్సింహా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, తదితరులను అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మను ఇంటినుంచే అరెస్టుచేశారు. ఏఐవైఎస్ రాష్ట్ర అధ్యక్షులు వలీఉల్లా ఖాద్రీని పోలీసులు హన్మకొండలో గృహనిర్బంధం చేశారు. జవహర్నగర్లో నిరసన చేపట్టిన సీపీఐ జాతీయ సమితి సభ్యులు ఎన్ బాలమల్లేశ్, ఈసీఐఎల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ అరెస్టయ్యారు. ఖమ్మంలో నిరసనలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ నేతలు ఎస్కే జానీమియా, సద్దినేని కర్ణకుమార్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి నాయకత్వంలో నల్ల బ్యానర్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. క్లాక్టవర్ సెంటర్, ఎన్జీకాలేజీ వద్ద టీఆర్ఎస్వీ నల్ల జెండాలను, నల్లబెలూన్లను ఎగురవేసింది. జిల్లా అంతటా విద్యార్థి, యువజనసంఘాలు నిరసనకు దిగాయి. హాలియాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాదగిరిగుట్టలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శన చేపట్టిన వామపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కూనంనేని అరెస్టు.. ఠాణాలోనే దీక్ష
రామగుండంలోని గోదావరిఖని 11ఏ గని వద్ద కార్మికుల గేట్ మీటింగ్లో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును అరెస్టు చేసిన పోలీసులు మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్స్టేషన్కు ఆయనను తరలించారు. సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జాతీయ సమితి సభ్యులు కలవేన శంకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి, మారపాక అనిల్ తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్త అరెస్టులకు నిరసనగా కూనంనేని పోలీస్లో స్టేషన్ దీక్షకు దిగారు.
అభివృద్ధి లేదా.. అవార్డ్స్ ఎందుకు ఇచ్చారు?
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే, అనేక రంగాల్లో ఉత్తమ ప్రగతి ప్రదర్శించిందంటూ అవార్డులు ఎందుకు ఇచ్చారు. అభివృద్ధి చెందలేదని చెప్తున్న మోదీ, అవార్డులు వెనక్కి తీసుకొంటారా? దేశ జీడీపీ కంటే రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువ. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటాన్ని జీర్ణించుకోలేక ప్రధాని మోదీ కుట్ర సాధిస్తున్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణను ఆగం చేయలేరు. బీజేపీకి తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ మద్దతు లభించదు.
– పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు
గత 8 ఏండ్లుగా ప్రధాని మోదీ తెలంగాణకు ఏమీ చేయలేదు. పైగా రాష్ర్టాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న మోదీని, రాష్ర్టానికి రాకుండా అడ్డుకోవడం తప్పెలా అవుతుంది. మొదటినుంచీ మోదీ తెలంగాణ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణను నుంచి బీజేపీలో ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్, కిషన్రెడ్డి, ఇతర నాయకులు తెలంగాణకు ఏనాడూ బాసటగా నిలువలేదు.
–కడియం శ్రీహరి (ఎమ్మెల్సీ)
మోదీకి పాలించే హక్కులేదు
జాతికి అంకితం చేసిన ఆస్తులను కార్పొరేట్లకు అమ్ముకొంటున్న మోదీకి దేశాన్ని పాలించే హకులేదు. కొంతమంది వ్యాపార స్నేహితుల ప్రయోజనం కోసం భారతదేశాన్ని ‘క్లియరెన్స్ సేల్’లో పెట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణలో అడుగుపెట్టే నైతిక మోదీకి ఉందా?
– కే నారాయణ (సీపీఐ జాతీయ కార్యదర్శి)
ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీకి బుద్ధిచెబుతాం
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎస్సీ వర్గీకరణ హామీని నెరవేర్చాలని కోరుతూ నిరసన తెలుపుతున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని మోదీ తుంగలో తొక్కారు. నిలదీసిన కార్యకర్తలను పోలీసులతో అరెస్టులు చేయించడం శోచనీయం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీని చిత్తుగా ఓడిస్తాం.
–వంగపల్లి శ్రీనివాస్ మాదిగ (ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు)
కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకాలి?
తెలంగాణకు మోదీ కేవలం ప్రధానిగా మాత్రమే రాలేదు. బీజేపీ నేతగా కూడా రాజకీయ లబ్ధి కోసం వచ్చారు. బేగంపేటలో నిర్వహించిన సభలో ‘నేను బీజేపీ కార్యకర్తగా వచ్చాను’ అని ఆయనే చెప్పుకున్నారు. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ వెళ్లి ఎందుకు స్వాగతం పలుకుతారు? సీఎం కేసీఆర్ బేగంపేటలో బొకే ఇచ్చి, స్వాగతం పలికిన 10 నిమిషాల తర్వాత.. మోదీ సభ పెట్టి సీఎం కేసీఆర్నే తిడితే ఎంత అవమానకరంగా ఉంటుందో ఊహించుకోవాలి. కర్ణాటకలో 40% కమీషన్ తీసుకుంటున్నారని కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది. గుజరాత్లోని మోర్బీలో వంతెన పునరుద్ధరణ పనులను ఏమాత్రం అనుభవం లేని వాచీల తయారీ కంపెనీకి ఇచ్చారు. మధ్యప్రదేశ్లో ఉద్యోగాల కుంభకోణం జరిగింది.
–ప్రొఫెసర్ కే నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ
ప్రధాని పచ్చి అబద్ధాలు చెప్పారు
సింగరేణిని ప్రైవేటీకరించడం లేదంటూ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రైవేటీకరణ లేకపోతే నాలుగు బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎందుకు వేలంలో పెట్టారు? ఇప్పటికే కోయగూడెం బ్లాకును ప్రైవేట్పరం చేశారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్నును రద్దు చేయాలని 2014లోనే అసెంబ్లీ తీర్మానించినా దానిపై మోదీ ఎందుకు మాట్లాడలేదు? కార్మికుల పెన్షన్ పెంపు అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎప్పుడో ప్రారంభమైన ఆర్ఎఫ్సీఎల్ను తిరిగి ప్రారంభించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిని నిర్బంధించి సభ జరుపుకున్నారు.
–రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి
పెనగడప బ్లాకును ఎందుకు చేర్చారు?
సింగరేణిని ప్రైవేటీకరించడం లేదన్న మోదీ.. బొగ్గు బ్లాకుల అంశంపై ఎందుకు మాట్లాడలేదు? దేశవ్యాప్తంగా 166 బొగ్గు బ్లాకులను ప్రైవేట్కు అప్పగించారు. సింగరేణికి సంబంధించి 15 బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించి, ప్రస్తుతానికి 5 బ్లాకుల పేర్లను వెల్లడించారు. తాజాగా పెనగడప బొగ్గు బ్లాకును చేర్చి తమ వైఖరేమిటో మోదీ బయటపెట్టుకున్నారు. కేంద్రం పరిధిలో పరిష్కరించాల్సిన ఆదాయ పన్ను రద్దు, పెన్షన్ తదితర అంశాలను దాటవేసి, సింగరేణి ప్రైవేటీకరణ అంశం రాష్ట్రం పరిధిలో ఉన్నదని పేర్కొనడం హాస్యాస్పదం.
–తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు
అరెస్టులు మోదీ భయానికి నిదర్శనం
శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అరెస్టు చేసిన తీరు ప్రధాని మోదీకి ఉన్న భయానికి నిదర్శనం. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా శుక్రవారం దాకా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. శనివారం కూడా ఎక్కడికక్కడ శాంతియుతంగా దీక్షలు చేస్తామని పోలీసులకు ముందుగానే తెలియజేశాం. అయినప్పటికీ పోలీసులు మా దీక్షను భగ్నం చేశారు. కార్యకర్తలను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. అరెస్టు అనంతరం జైపూర్ పోలీస్స్టేషన్లో కూడా మా దీక్షను కొనసాగించాం.
– కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి